శరవేగంగా ‘చిరు158’ షూటింగ్

'Chiru 158' shooting progressing at a rapid pace.
Spread the love

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌ లో రూపుదిద్దుకుంటున్న చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ విజయవంతమైన కాంబో మరోసారి చేతులు కలపడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే పొల్లాచ్చిలో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న చిత్ర బృందం, సోమవారం హైదరాబాద్‌లో ఒక కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. పొల్లాచ్చి షెడ్యూల్‌లో హై-వోల్టేజ్ యాక్షన్, ప్రధాన తారాగణం పాల్గొన్న కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ పూర్తి కావడాన్ని పురస్కరించుకుని ‘బిహైండ్-ది-సీన్స్’ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియోలో సెట్స్‌లో ఉన్న ఉత్సాహభరితమైన వాతావరణం, ప్రతి సన్నివేశం వెనుక ఉన్న ప్లానింగ్, సినిమాను ఎంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారో చూడవచ్చు. ఇందులో చిరంజీవి హుందాగా, హై ఇంటెన్స్ కూడిన లుక్‌లో కనిపిస్తుండగా, అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కూడా షూటింగ్‌లో పాల్గొనడం కనిపించింది. ఈ బిట్స్ వీడియోలో హైలెట్ గా నిలిచిన అంశం దర్శకుడు బాబీ కొల్లికి సంబంధించిన ఒక మూమెంట్. ఒక సన్నివేశంలో చిరంజీవి పూర్తిగా లీనమై నటించడాన్ని చూసి దర్శకుడు భావోద్వేగానికి లోనయ్యారు. మెగాస్టార్ అద్భుతమైన నటనను చూసి ముగ్ధుడైన ఆయన “జీవించేశారు అన్నయ్యా” అని ఉద్వేగంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు బాబీ కొల్లి చిరంజీవిని ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో చూపించబోతున్నన్నారు. తాజాగా విడుదలైన చేసిన వీడియోలో ఆయన రెస్పాన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తయిన తర్వాత, చిత్ర బృందం కొత్త షెడ్యూల్ ను హైదరాబాద్‌ లో మొదలుపెట్టింది. కథకు వెన్నెముకగా నిలిచే కీలకమైన టాకీ పార్ట్స్, ప్రధాన యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించనున్నారు.  ఈ భారీ ప్రాజెక్ట్‌కు టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ చిత్రానికి అద్భుతమైన విజువల్స్ అందించనున్నారు. ప్రొడక్షన్ డిజైన్ అవినాశ్ కొల్లా నిర్వహిస్తుండగా, ఎడిటింగ్‌ను ఆంటోని ఎల్. రూబెన్ చేస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి ఆడిషినల్ స్క్రీన్‌ప్లే రచయితలుగా పనిచేస్తున్నారు. భాను–నందు ద్వయం సంభాషణలను అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.

Related posts