అల్లాణి శ్రీధర్ తెలుగు సినిమా రచయిత, నిర్మాత, దర్శకుడు. 1988లో ‘కొమరంభీమ్’ చిత్రంతో దర్శకత్వంలో అరంగేట్రం చేశారు. ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా, ఉత్తమ దర్శకుడుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 1990లో నంది అవార్డు అందుకున్నారాయన. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ అవార్డ్స్ విధివిధానాల కమిటీలో సభ్యునిగా పని చేశారు. అల్లాణి శ్రీధర్ పుట్టినరోజు (జూన్ 24.6.2026) సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆయనకు ఫిలింఛాంబర్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా అల్లాణి శ్రీధర్ మాట్లాడారు ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…
”ఈ రోజు నా జన్మదినం అనేది గొప్పగా అనుకోవడం లేదు. నేడు ఈ వేదికపైన ఇంత మంది మిత్రులను కలుసుకోవడం నా జన్మదినం కాదుగాని.. పునర్జన్మదినంగా భావిస్తున్నాను. నేను ‘కొమరం భీమ్’ చేసే రోజుల్లో అడవుల్లో ఉన్నప్పుడు మా మిత్రుడు ప్రభు జర్నలిస్టులను తీసుకొచ్చి కవరేజ్ చేసేవాళ్ళు. ‘కొమరం భీమ్’ సినిమా విడుదల కోసం 18 ఏళ్ళు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కానీ విడుదలయ్యాక అది నాకొక గుర్తింపుని తీసుకొచ్చింది. దాసరిగారు ఎప్పటికైనా సింహమే. దర్శకుడిగా లెజండ్ అని చెప్పాలి. ఆయనతో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఆయన ఏదైనా సరే ఒక సీన్ని డైరెక్ట్ చేసి తిరిగి మళ్ళీ అడిగేవారు.. అదే విధంగా అక్కినేని నాగేశ్వరావుగారు ఆయన ఏదైనా షూటింగ్ సమయంలో డౌట్లు వస్తే వెంటనే అడిగి తెలుసుకునేవారు. ఈ షాట్ క్లోజప్ పెట్టారు ఎందుకని అని ప్రతిదీ నన్ను అడిగేవారు. ఇంతమంది గొప్పవాళ్ళతో పనిచేసే అదృష్టం దేవుడు నాకు ఇచ్చారు. నన్ను వాళ్ళు చాలా బాగా అభిమానించేవారు. నేను నా వృత్తిలో ఏ రోజు సెలవు తీసుకోలేదు. కొమరం భీమ్ నుంచి ఇప్పటి వరకు సెలవు లేదు. ఏఐ స్టూడియోస్ పెట్టి కొన్ని సినిమాలు చేస్తున్నాను. ప్రముఖ వ్యక్తి బయోపిక్ చేస్తున్నాము. ఒక పెద్ద కంపెనీతో కలిసి పని చేస్తున్నాను. అది అధికారికంగా వాళ్ళు ఎనౌన్స్ చేస్తారు. అదే విధంగా ఈ మధ్య కాలంలో నా మదిలో ఓ చిన్న వెలితి ఉండిపోయింది. చిన్న పిల్లలకు సంబంధించిన సినిమాలు అసలు లేనే లేవు. ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్లో జ్యూరీలో నేను పని చేశాను. బాలల చిత్రాలు చాలా అరుదు అయిపోయాయి. పిల్లల చేతుల్లో కేవలం మొబైల్ ఫోన్లు ఎక్కువయిపోయాయి. దీంతో సోషల్ మీడియా ఎక్కువయిపోయింది. మొబైల్ వ్యసనంగా మారిపోయింది. దానికోసం చిన్న పిల్లల కోసం నేను. నా మిత్రులు కలిసి బాలల చిత్రాలు చేయాలనుకుంటున్నాము. బయెపిక్ , ఏఐ సినిమాలు, వెబ్సిరీస్ ఇలా చాలా ప్రాజక్టులు అనుకుంటున్నాము. ఇటీవలె సింగీతం శ్రీనివాస్గారు ఈ వయసులో కూడా ఒక అద్భుతమైన సినిమా చేశారు. ఆయన ఇన్స్పిరిషన్ అని కాదు… నాగేశ్వరావుగారు యాక్టింగ్ చేస్తూనే పోవాలని అనుకుంటున్నాను అన్నారు. ఇలా చివరి శ్వాస వరకు పని చేస్తూనే ఉండాలన్నది నా కోరిక అన్నారు. నేను కూడా యాక్షన్ చెపుతూనే కట్ చెప్పే సమయంలో మనం వెళ్ళిపోవాలి అన్నది నా కోరిక. ప్రతి రోజూ కొత్త రోజే. నాకు ఇంత మంచి అవకాశం సందర్భం కలిపించిన ఫిలిం క్రిటిక్స్ అసోసియషన్ వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. కరోనా దగ్గర నుంచి ప్రేక్షకుల అభిప్రాయాం బాగా మారిపోయింది. ‘బలగం’ అనే సినిమాలకు ఆదరణ ఉంటుంది. చాలా మంది చూస్తున్నారు. ప్రేక్షకుల నాడి చూసుకుని వెళ్లాల్సిందే. బాలల సినిమాల్లో కొంత మంది బాలలని నటులుగా తీసుకుని రాజేంద్రప్రసాద్ ఇలా కొంత మంది ఆర్టిస్టులతో సినిమాలు చేయాలన్నది మా ప్లాన్. సినిమా అనేది ఒక రెవెల్యూషన్ లా అయిపోయింది. మాధ్యమాలు మారిపోయాయి కాబట్టి కుటుంబానికంటే కూడా డబ్బుకంటే కూడా ఐడియాకే ఎక్కువ శక్తి ఉన్న సమయం ఇది. ఒక ఐడియా అనేది శిఖరం లాంటిది. ఏఐ అనేది 24 క్రాఫ్ట్స్ని కిల్ చేస్తుందని అనుకుంటున్నారు.. కానీ అది పరెగెత్తిస్తుంది తప్ప కిల్ చేయడం లేదు. మన ఐడియాని రిఫైండ్ చేస్తుంది. ఏఐ అనేది అద్భుతమైన భవిష్యత్తు నిర్మిస్తుంది. ఏఐ స్టూడియో పెట్టారు. ఇండస్ట్రీలో ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది. టెక్నీషియన్స్ తమ నైపుణ్యాన్ని మెరుగుపరుస్తారు అంతే తప్ప ఉద్యోగాలు పోవు. ఏఐ కూడా ఒక సాధన లాంటిది. అనవసరమైన భయం అపోహలు తప్ప ఒక అద్భుతమైన ఊహలను నిజం , చేసుకునే లాంటిది. పిల్లలకు సినిమాలు లేకుండా చేయడం అనేది సరైనది కాదు. ప్రతి ఒక్కరి బాధ్యత. కేవలం ప్రభుత్వమే కాదు సమాజం కూడా బాధ్యత ఉంది. పిల్లల కోసం సినిమా అనేది కల కాదు. నిజం. సినిమా బడ్జెజ్ కథను బట్టి ఉంటుంది. తారలను బట్టి మార్కెట్ని బట్టి డిమాండ్ ఉంటుంది. హై బడ్జెట్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. సరిగా తీయకపోతే డబ్బులు వెనక్కిరావు. సినిమా అనేది రెండు కోట్లతో మొదలుపెట్టి ఎంతైనా పెట్టుకోవచ్చు. సబ్జెక్ట్ని బట్టి సినిమా బడ్జెట్ ఉంటుంది” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ బాలిరెడ్డి మాట్లాడుతూ… గోస్వామి తులసిదాస్’ సినిమా అన్నది మనం మర్చిపోలేని సినిమా అని గుర్తు చేయడం జరిగింది. శ్రీధర్గారితో నాకు చాలా ఏళ్ళ అనుబంధం ఉంది. ఆయన మరిన్ని చిత్రాలు తీసి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
సీనియార్ జర్నలిస్ట్ లక్ష్మణరావు మాట్లాడుతూ…‘ శ్రీధర్గారితో అనుబంధం కొంత గ్యాప్ వచ్చినప్పటికీ.. ఆ రోజుల్లో ఆయన చేసిన సినిమాలు అభ్యుదయ భావాలకు ప్రతీకగా నిలిచాయి. ఆయన స్వయం కృషితో చేసిన సాధనలు. మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని అన్నారు.
శ్రీమతి జమునారాణి సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతూ…ఈ వేదికపైన రెండు విషయాలు చెప్పుకోవాలంటే సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కళకళలాడుతుంది. ఎంతోమంది సీనియర్ పాత్రికేయులను కలవడం ఆనందంగా ఉంది. శ్రీధర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అని అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ ఆర్.డి.ఎస్ ప్రకాశ్ మాట్లాడుతూ… శ్రీధర్గారితో నాకు దాదాపుగా 25ఏళ్ళుగా పరిచయం ఉంది. అప్పట్లో నేను ఒక ఆర్టికల్ని చదివాను రగులుతున్న భారతం అనే టైటిల్ పెట్టారు. దాని గురించి ఆయనకు చెప్పాను మీరు చాలా బాగా దాసరిగారితో..అక్కినేనిగారితో చేస్తున్నారు. అని చెప్పి ఆ ఆర్టికల్ గురించి ప్రస్తావిస్తూ… ఆయన సినిమాలు చాలా ఉన్నాయి. మరిన్ని సినిమాలు చేసి.. కమర్షియల్ సక్సెస్లు మరిన్ని సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఫిలిం క్రిటిక్స్ అధ్యక్షులు బత్తుల ప్రసాద్ మాట్లాడుతూ..ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమం ద్వారా ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ చిరు సత్కారం చేయాలని అనుకుంటున్నాము. అల్లాని శ్రీధర్ గారి గురించి చెప్పాలంటే నా గరించి నేను చెప్పుకున్నట్లు ఉంటుంది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నాకు సోదరుడితో సమానం అన్నారు.
ఫిలిం క్రిటిక్స్ జనరల్ సెక్రటరీ సురేష్కొండేటి మాట్లాడుతూ… వార్తలో ఉన్నప్పుడు నేను 90లలో నేను శ్రీధర్గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అంతేకాక ఆతరువాత సంతోషం సినీ వారపత్రికకు కూడా ఆయనను నేను పర్సనల్గా ఇంటర్వ్యూ చేశాను. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ కార్యక్రమాన్ని మా ద్వారా చేసే అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇంత చక్కని అవకాశం కల్పించినందుకు ఆయనకు కృతజ్ఞతలు అన్నారు.
ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ఫిలిం క్రిటిక్స్ జాయింట్ సెక్రటరీ శ్యామ్ కుమార్, పర్వీన్బాబి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మామిడాల గిరిధర్, కేశవాచారి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్ సీనియర్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ వ్యాఖ్యతగా వ్యవహరించారు.









