‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేడుక గీతం ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ విడుదల

The much-awaited celebratory song 'Aara of Ustad' from 'Ustad Bhagat Singh' is released.
Spread the love

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. ఆయన తెరపై కనిపించడమే అభిమానులకు ఓ వేడుక. ఇక పవన్ కళ్యాణ్‌ మేనరిజమ్స్‌ కి ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఎన్నో సంవత్సరాలుగా, లక్షలాది మంది పవన్ కళ్యాణ్ యొక్క ఐకానిక్ మేనరిజమ్‌లను అనుకరించారు. ఆ అప్రయత్నమైన స్వాగర్‌ను, ఆ ఉత్తేజకరమైన బాడీ లాంగ్వేజ్‌ను, ఆ ప్రత్యేకమైన అటిట్యూడ్‌ను తిరిగి సృష్టించడానికి చాలామంది ప్రయత్నించారు. కానీ, ఇప్పటి వరకు ఎవరూ దానికి అసలైన నిర్వచనం ఇవ్వలేకపోయారు. ఇప్పుడు “ఆరా ఆఫ్ ఉస్తాద్”తో ఆ నిర్వచనం శాశ్వతంగా చెక్కబడింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 2026 మార్చి 26న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఇప్పటికే విడుదలైన తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’ విశేషంగా ఆకట్టుకుంది. వింటేజ్ పవర్‌స్టార్ ను ఆవిష్కరించిన ఈ పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది.
ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి రెండవ గీతంగా ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ విడుదలైంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ లో ఈ గీతావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. పవర్‌స్టార్ ఆరాను ప్రతిబింబించేలా ఈ గీతముంది. “నేను మెడ ముట్టుకుంటే, తొడ కొట్టినట్టే” అనే లైన్ కేవలం పవర్‌ఫుల్‌గా వినిపించడమే కాదు.. అది పవర్ స్టార్ ఆరాలోని అసలైన స్పూర్తిని ప్రతిబింబిస్తుంది. ఇక ఒక సంజ్ఞ యొక్క ప్రభావాన్ని, ఒక కదలిక యొక్క బరువును మరియు అభిమానుల్లో రేకెత్తించే ఉత్సాహాన్ని అద్భుతంగా చూపిస్తుంది.
కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ అభిమానులు సంవత్సరాల పాటు గుర్తుంచుకునే ఒక వేడుక గీతాన్ని అందించారు. ఇది కేవలం నివాళి కాదు – ఇది సంగీత రూపంలో ఒక పండుగ. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన సంచలనాత్మక, హై-వోల్టేజ్ కూర్పుతో అంచనాలను పెంచేశారు. మాస్ ఎనర్జీతో నిండిన ఈ సంగీతం ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది. చంద్రబోస్ రాసిన శక్తివంతమైన సాహిత్యం పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మాను సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది. “ఆరా ఆఫ్ ఉస్తాద్” కేవలం ఒక పాట కాదు – ఇది ఒక నిర్వచన క్షణం. ఒక స్టేట్‌మెంట్. తరతరాలను ప్రేరేపిస్తూ ముందుకు సాగుతున్న ఓ వారసత్వానికి ఇది ఒక ఘనమైన వేడుక.
‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ గీతావిష్కరణ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “ఈ పాటకు ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ అని ఏ ముహూర్తాన పెట్టామో.. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో ఆ ఆరా కనిపిస్తుంది. ‘నేను మెడ ముట్టుకుంటే, తొడ కొట్టినట్టే’. సినిమాలో ఒక సన్నివేశంలో ఈ డైలాగ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు రెండు దశాబ్దాల నుంచి ఈ మేనరిజమ్ చేస్తున్నారు. దీనికి మాట రూపంలో చెప్తే బాగుంటుంది అనిపించింది. ఆ ఆలోచన నుంచి ఈ డైలాగ్ వచ్చింది. ఆ మాటను హుక్ లైన్ గా తీసుకొని మంచి పాటగా మలిచాము. ఆ ఆరాకి ఖచ్చితంగా ఆస్కార్ కలమే కావాలి అనిపించింది. వెంటనే చంద్రబోస్ గారిని కలిసి ఈ పాట గురించి చెప్పాము. కేవలం ఎనిమిది గంటల్లో పాట సిద్ధమైంది. ఇది పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వచ్చిన పాట కాదు. ఆయన మీద అవగాహనతో రాసిన పాట. ఏ లైన్ విన్నా పవన్ కళ్యాణ్ గారే గుర్తుకొస్తారు. ఈ పాటలోని ‘మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదోయ్ నువ్వు.. బండరాళ్లను బద్దలుకొట్టిన మొండి మొక్కవు నువ్వు’ అనే లైన్ నాకు బాగా నచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ గారు ఈ పాటకు ప్రాణం పెట్టారు. పవన్ కళ్యాణ్ గారికి దేవి శ్రీ ప్రసాద్ గారు పాటాభిషేకం చేస్తే, చంద్రబోస్ గారు సిరాభిషేకం చేశారు. పవన్ కళ్యాణ్ గారి నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. అభిమానులకు నచ్చేలా ఉంటుంది. కళ్యాణ్ గారు ఈ సినిమా కోసం రోజుకి 18 గంటలు కష్టపడిన రోజులు ఉన్నాయి. మా నిర్మాతలు మేము అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చి, మాకు అన్ని విధాలా అండగా నిలిచారు.” అన్నారు.
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిలో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే.. ఆయన మనుషులను గౌరవించే విధానం, మనుషులను గుర్తు పెట్టుకునే విధానం. ఒక్కసారి మనిషి నచ్చాడంటే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. చిన్నప్పుడు నేను మాండొలిన్ నేర్చుకునేటప్పుడు ఆయన చూశారు. ఇప్పటికీ ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్నారు. అది ఆయన గొప్పతనం. ‘దేఖ్‌లేంగే సాలా’ విని, చాలా రోజుల తరువాత నాకు డ్యాన్స్ చేయాలనే ఉత్సాహం కలిగిందని పవన్ కళ్యాణ్ గారు నన్ను అభినందించారు. అలాగే ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాట విని నాకు ఫోన్ చేసి, చాలా బాగుందని అభినందించారు. ఈ పాట చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ‘ఆరా ఆఫ్ పవన్ కళ్యాణ్’. ఎప్పటికీ నిలిచిపోయే పాట ఇది. ఇంత గొప్ప పాట పుట్టడానికి ప్రధాన కారణం హరీష్ శంకర్ గారు. పవన్ కళ్యాణ్ గారి మేనరిజమ్ ని ‘నేను మెడ ముట్టుకుంటే, తొడ కొట్టినట్టే’ అని వర్ణించడం అద్భుతం. అలాగే, చంద్రబోస్ గారు గొప్ప సాహిత్యం అందించారు. మైత్రి నిర్మాణ సంస్థ నా హోమ్ బ్యానర్ లాంటిది. సినిమా అంటే వారికి ఎంతో తపన. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం అద్భుతంగా వచ్చింది.” అన్నారు.
గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. “నేను పవన్ కళ్యాణ్ గారికి ఆయన మొదటి సినిమా నుంచి పాటలు రాస్తున్నాను. ఎన్నో విజయవంతమైన పాటలకు సాహిత్యం అందించాను. గబ్బర్ సింగ్ సినిమాలోని ‘ఆకాశం అమ్మాయైతే’ అనే పాట దేవి శ్రీ ప్రసాద్ గారు, హరీష్ శంకర్ గారు, నా కలయికలో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మా అందరి కలయికలో మీ ముందుకు వచ్చిన పాట ‘మెడ ముట్టుకుంటే, తొడ కొట్టినట్టే’. ఈ పాట పవన్ కళ్యాణ్ గారి నిజమైన మనస్తత్వం, నిజమైన వ్యక్తిత్వం, ఆయన నమ్మిన సిద్ధాంతాలు, ఆయన ఆచరించే సూత్రాలు, ఎంచుకున్న మార్గం, ఆ మార్గంలో పయనించే విధానం. ఇది నిజం.. ఇది పవనిజం.” అన్నారు.
మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం వైస్-ఛైర్‌పర్సన్ ప్రీతి రెడ్డి మాట్లాడుతూ.. “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాటను మా క్యాంపస్ లో ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మాకెంతో గర్వకారణం. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను.” అన్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Related posts