హీరో అభిమాని ఏకంగా కొన్ని కోట్ల విలువైన తన ఆస్తిని స్టార్ హీరో పేరు మీద రాసిచ్చి చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. సదురు హీరో చలించిపోయాడు. ఇంతకు ఏం జరిగిందంటే.. ముంబైకు చెందిన నిషా పాటిల్ కు నటుడు సంజయ్ దత్ అంటే పిచ్చి అభిమానం. చిన్నప్పటి నుంచి ఆయన్ను ఆరాధిస్తూ పెరిగింది. నామ్ నుంచి ఖల్ నాయక్ దాకా, సంజు నుంచి కెజిఎఫ్ 2 దాకా ప్రతి చిత్రాన్ని కొన్ని వందల సార్లు చూసింది. లెక్కలేనంత డబ్బు టికెట్లకే పెట్టింది. అయితే ఇటీవల నిషా పాటిల్ కన్నుమూసింది. ఆమె వయసు 62 సంవత్సరాలు. కన్నుమూసే నాటికి సుమారు 72 కోట్ల రూపాయల ఆస్తి నిషా పేరిట ఉంది. కాగా, అదంతా సంజయ్ దత్కు రాసేసి వెళ్లిపోవడం కుటుంబ సభ్యులను షాక్ కు గురి చేసింది. తన చివరి రోజులను ముందే గుర్తించిన నిషా పాటిల్ ఆస్తి డాక్యుమెంట్లను 2018లోనే లీగల్ గా రాయించి, బ్యాంకు అకౌంట్లలో ఉన్న డబ్బుని సంజయ్ దత్ కి అందజేయాలని లెటర్లు రాసి పక్కాగా బదలాయింపు చేసింది. ఇదంతా ఇంటికి దస్తావేజులు వచ్చాక కానీ.. సంజు బాబాకు మేటర్ అర్థం కాలేదు. అసలు పరిచయమే లేని ఒక అపరిచితురాలు ఆస్తి రాసివ్వడం చూసి నివ్వెరపోయాడు. విషాదం ఏంటంటే నిషా పాటిల్ ఇప్పటిదాకా సంజయ్ దత్ ని ప్రత్యక్షంగా కలవలేదు. కానీ.. తన హీరో మీద ప్రేమతో కోట్ల రూపాయలు కానుకగా ఇచ్చింది. సంజయ్ దత్ వాటిని స్వీకరించలేదు. త్వరలోనే వాళ్ళ ఫ్యామిలీకే అవి తిరిగి చెందేలా తన లీగల్ టీమ్ ని పురమాయించారు. ఇంత వీరాభిమానిని కలుసుకోలేకపోవడం కలవపరిచిందని, కనీసం కుటుంబ సభ్యులనైనా కలిసి కొంత ఊరట చెందుతానని సంజయ్ దత్ పేర్కొన్నారు.
హీరో కోసం కోట్ల ఆస్తిని రాసిచ్చింది..
