దక్కన్ క్రానికల్ సీనియర్ జర్నలిస్ట్, దక్కన్ క్రానికల్ ఎంప్లాయిస్ యూనియన్ పూర్వ ఉపాధ్యక్షులు మిత్రులు దేవా భీమ్ రాజ్ కనుమూశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్ బారినపడి చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు తుది శ్వాస విడిచారు.
క్రానికల్ వదిలేసి ముఖ్యమంత్రి మీడియా సలహాదారులు శ్రీరామ్ కర్రి టీమ్ లో ఈయన సేవలు అందిస్తూ వచ్చారు. జవహర్ లాల్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ లో భీమ్ రాజ్ చురుకుగా వ్యవహరించారు. అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తూ జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం కృషి చేశారు. 2007 నుంచి ఇంటి స్థలాల కోసం డైరెక్టర్ల కు అండగా ఉండి కార్యాలయాన్ని చక్కగా నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. స్థలాలు దక్కకుండానే సొసైటీ లో అనేక మంది అనారోగ్యాల బారిన పడ్డారని, 90 మందికి పైగా చనిపోయారని బీమ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేస్తుండే వారు! క్యాన్సర్ భూతంతో యుద్ధం చేస్తున్నా ఆయన ముఖాన నవ్వు చెదరలేదు! ఆయన ఆత్మ విశ్వాసం సన్నగిల్లలేదు! “ఏం కాదండి, తిరిగి కోలుకుంటాను. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇంటి పట్టా అందుకుంటాం. నాకు నమ్మకం ఉంది” అని ఎంతో భరోసాగా చెబుతుండే వారు బీమ్ రాజ్!
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. జర్నలిస్టుల కోసమే కేటాయించిన నిజాంపేట్, పేట్ బషీరాబాద్ భూములను జర్నలిస్టులకు అప్పగించాలి. భీమ్ రాజ్ మృతికి అసలైన నివాళిగా వారి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలి. సొసైటీ లో వందలాది సభ్యులు ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తూ ఉన్నారు. భీమ్ రాజ్ లాంటి వాళ్ళు సొసైటీ నేతలుగా ఎంతో శ్రమించారు. కానీ, ఫలితాలు చూడకుండానే ఈ లోకాన్ని వీడారు. మిత్రమా భీమా అశ్రు నివాళి. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
సీనియర్ జర్నలిస్ట్ భీమ్ రాజ్ ఇకలేరు!
