పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తాజాగా సెట్స్ పై వచ్చిన ‘ఉస్తాద్ భగత్సింగ్’ను వదులుకున్నబ్యూటీ ఎవరో తెలుసా? పూజాహెగ్డే! అవును.. ఇది నిజంగా నిజమైన వార్తే! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాని వదులుకోవడమేమిటి? అని అనుకుంటున్నారు కదూ..!? అవును ఎవ్వరికైనా ఇదే డౌట్ రావడం కామనే! పరిశ్రమలో టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్స్ రెండుపడవల ప్రయాణం చేస్తున్నారు. టాలీవుడ్-బాలీవుడ్ అంటూ అవసరానికి కోలీవుడ్ లో కూడా అడుగు పెట్టాలనుకుంటున్నారు. ఇదంతా ఆ భామల అత్యాశే అవుతోంది. అక్కడా మేమే .. ఇక్కడా మేమే అన్న రీతిలో వీరి వ్యవహారం సాగుతోంది. ఫలితంగా కాల్షీట్స్ కుదరకపోవడంతో కొన్ని మంచి సినిమాలను సైతం వదులుకోవలసి వస్తోంది. అన్ని భాషల్లో తమ గ్లామర్ ని పంచుతుంటారు ఈ బ్యూటీస్. ఈ క్రమంలో నాయికలు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఒప్పుకున్న సినిమాలకు డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడం. దీంతో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా వాళ్లు వదులుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందిప్పుడు. అందాల తార పూజా హెగ్డేకూ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే ఎదురైనట్లు కనిపిస్తున్నది. ఆమె స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘ఉస్తాద్ భగత్సింగ్’లో నాయికగా నటించాల్సి ఉంది. ఈ సినిమా గతంలో ‘భవధీయుడు భగత్సింగ్’ పేరుతో అనౌన్స్ అయినప్పుడు పూజా హెగ్డేనే నాయికగా అనుకున్నారు. అయితే పవన్కు అప్పటికున్న సినిమాలు, రాజకీయ కార్యకలాపాల వల్ల సెట్స్ మీదకు ఆలస్యంగా అడుగుపెట్టింది. ఇటీవలే ‘ఉస్తాద్ భగత్సింగ్’గా పేరు మార్చుకుని లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ఆలస్యంతో పూజా ఈ చిత్రం కోసం కేటాయించిన డేట్స్ కుదరలేదని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం నుంచి ఆమె తప్పుకున్నట్టు తెలిసింది. అయితే డేట్స్ ఒక్కటే కారణమా? లేక ఇంకేమైనా కారణం ఉందా? అన్నది అనేది తెలియాల్సి ఉంది. పవన్, పూజా కాంబోను చూసే అవకాశం ఈ చిత్రంతో ఇక లేనట్టేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుందని యూనిట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పూజా హెగ్డే మహేష్ బాబు 28వ చిత్రంతో పాటు, బాలీవుడ్లో రన్ వీర్ సింగ్తో ‘సర్కస్’, సల్మాన్ ఖాన్ సరసన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా ఉంది.
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్సింగ్’ నుంచి పూజాహెగ్డే ఔట్!?
