సమసమాజ స్థాపన కోసం, మహిళా అభ్యున్నతి కోసం సావిత్రీబాయి పూలే దంపతులు అద్వితీయ పోరాటం చేశారు. వారి పోరాటానికి సజీవ దృశ్యంలా ‘ఫూలే’ సినిమాను రూపొందించడం అభినందనీయం. ఆ గొప్ప సంఘ సంస్కర్తల స్ఫూర్తితో ప్రతి ఒక్కరం గొప్ప సమాజం కోసం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది అని ఆలేరు శానసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర నిర్మించిన ‘ఫూలే’ సినిమా ప్రత్యేక ప్రదర్శన సోమవారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘పూలే’ సినిమాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీక్షించారు. శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత , ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీ నుంచి ఆర్టీసీ బస్సులో ప్రసాద్ ల్యాబ్కు చేరుకున్నారు. సామాన్య ప్రజల మాదిరిగానే ప్రజాప్రతినిధులందరూ బస్సులో ప్రయాణించడం విశేషం. సీఎం ప్రయాణిస్తున్న బస్సుకు పోలీసులు భారీ భద్రత కల్పించారు. అనంత్ మహదేవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ హిందీ చిత్రం గతేడాది ఏప్రిల్ 25న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చిత్రంలో జ్యోతిరావు పూలేగా ప్రతీక్ గాంధీ, సావిత్రీబాయి పూలేగా పత్రలేఖ పాల్ నటించారు. కుల నిర్మూలన కోసం ఆ దంపతులు చేసిన పోరాటాన్ని, మహిళా విద్య కోసం వారు ఎదుర్కొన్న సవాళ్లను సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.
ఈ సందర్బంగా డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ – మా ముఖ్యమంత్రి గారితో సహా మంత్రివర్గ సహచరులను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పూలే సినిమా ప్రత్యేక ప్రదర్శనకు ఆహ్వానించిన మా మంత్రివర్గ సహచరులు పొన్నం ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా భారతీయ సమాజానికి అద్భుతమైన సందేశాన్నిస్తుంది. మహిళా అభ్యున్నతి కోసం, ఆనాటి సమాజంలో ఉన్న కులవివక్ష ఇతర ఇబ్బందులను తట్టుకుని సమసమాజం కోసం పూలే దంపతులు వేసిన పునాదులు వేశారు. ఈ రోజు ఆ ఫలాలను, ఫలితాలనే మన స్వంతత్ర భారతదేశంలో అనుభవిస్తున్నాం. వారు వేసిన పునాదుల మీద సాగుతూ వారి ఆశయాలను, లక్ష్యాలను సాధించడంలో మా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కృషి చేస్తాం అన్నారు.
సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ మాట్లాడుతూ – పూలే సినిమాకు సంగీతాన్ని అందించే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. పూలే సినిమా చూస్తున్నంత సేపు ఉద్వేగానికి గురయ్యాను. చివరలో కన్నీళ్లు వచ్చాయి. మహిళల కోసం జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే చేసిన కృషి సర్వదా అభినందనీయం అన్నారు.
కాంగ్రెస్ నేత వీహెచ్ మాట్లాడుతూ – పూలే సినిమాను గొప్పగా రూపొందించారు. ఈ సినిమా ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి కలిగిస్తుంది. ఈ సినిమాను ఊరూ వాడా ప్రదర్శించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. పేదవారిని గొప్ప స్థాయికి తీసుకెళ్లేది చదువు మాత్రమే. ఆ చదువును అందరికీ అందించేందుకు మహిళా వివక్షను, దురాచారాలను రూపు మాపేందుకు కృషి చేస్తూ సమాజం కోసం జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే తమ జీవితాలను అంకితం చేశారు. అన్నారు.
నిర్మాత, జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ – పూలే సినిమా ప్రత్యేక ప్రదర్శనకు సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం సంతోషంగా ఉంది. ఆయన రెండు గంటలకు పైగా సమయం వెచ్చించి సినిమాను చూశారు. ఈ సినిమాను ప్రతి గ్రామంలో ప్రదర్శించేలా అవకాశం కల్పించాలని కోరుతున్నాను. సమాజంలోని రుగ్మతలు తొలగించుకునేందుకు, అందరికీ విద్యను అందించేందుకు ప్రతి ఒక్కరిలో పూలే సినిమా స్ఫూర్తిని కలిగిస్తుంది. అన్నారు.
సామాజిక సంస్కర్తల జీవితాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం : ఆలేరు శానసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
