కొన్నాళ్లుగా ఫ్లాపులతో సతమతం అవుతున్న పూరీ జగన్నాథ్ ఇప్పుడు టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతితో కలిసి ఓ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాను చాలా పకడ్బందీగా ఎలా అయినా హిట్టు కొట్టాలని గట్టిగానే ప్లాన్ చేసారు పూరీ జగన్నాథ్. కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఈ సినిమాలో టబు, రాధిక ఆప్టే వంటి హీరోయిన్లు నటించబోతున్నారు అంటూ వార్తలు రాగా, ఆ తర్వాత రాధికా ఆప్టే స్థానంలో నటి నివేదా థామస్ నటించనున్నట్టు ప్రచారం జరిగింది. వీటిపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ , చెన్నైలలో లొకేషన్లను వెతుకుతున్నారట. ఈ సినిమా షూటింగ్ జూన్ చివరి వారంలో ప్రారంభమవుతుందని తెలుస్తుంది. విజయ్ సేతుపతి, దర్శకుడు పూరి జగన్నాధ్ కలిసి నటిస్తున్న మొదటి చిత్రం కాగా, ఈ మూవీ హిట్ కావడం పూరీ జగన్నాథ్కి చాలా అవసరం. ఈ సినిమాపైనే పూరీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఏమాత్రం తేడా కొట్టి బెడిసి కొట్టినా కూడా పూరి జగన్నాథ్ కెరీర్ అంధకారంలో పడడం ఖాయం. అందుకే ఈ మూవీని ఒళ్లు దగ్గర పెట్టుకొని చిత్రీకరించనున్నాడు. పూరి జగన్నాథ్ తనదైన శైలిలో, ఓ సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతాడని తెలుస్తుంది. విజయ్ సేతుపతి ఇమేజ్కు తగ్గట్టుగా ఆయన పాత్రను పవర్ఫుల్గా డిజైన్ చేసినట్లు సమాచారం. పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ఇప్పటికే నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తయినట్టు తెలుస్తుంది. తొలి షెడ్యూల్లో విజయ్ సేతుపతితో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొననున్నారు. ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను ఏకకాలంలో విడుదల చేయనున్నారు. అయితే ఈ మూవీకి ‘బెగ్గర్’ అనే టైటిల్ ముందుగా అనుకున్నారు..ఇప్పుడు ‘భవతీ భిక్షాందేహి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. మూవీ టైటిల్ చూస్తుంటే బిచ్చగాడు మూవీ తరహాలో ఈ మూవీ ఉంటుందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పూరీ సినిమాకు విచిత్రమైన టైటిల్!
