(చిత్రం : ‘భీమదేవరపల్లి బ్రాంచీ’, విడుదల : 23 జూన్-2023, రేటింగ్ : Rating 3/5, నటీనటులు: అంజి వల్గుమాన్, సాయి ప్రసన్న,రాజవ్వ, సుధాకర్ రెడ్డి, కీర్తి లత గౌడ్, అభిరామ్, రూప శ్రీనివాస్, శుభోదయం సుబ్బారావు, గడ్డం నవీన్, వివ రెడ్డి. మిమిక్రీ మహేశ్, బైరన్న, సి.ఎస్.ఆర్, రచన-దర్శకత్వం: రమేశ్ చెప్పాల, నిర్మాతలు: బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి, కెమెరా: కె.చిట్టి బాబు, సంగీతం: చరణ్ అర్జున్, సాహిత్యం:సుద్దాల అశోక్ తేజ.సంజయ్ మహేష్ వర్మ, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే, పిఆర్ఓ: శ్రీధర్).
ఓ అందమైన గ్రామం.. అడుతూ పాడుతూ సాగుతున్న జీవితాలు.. కుల వృత్తులతో ఒకరికొకరు ఆప్యాయత పంచుకుంటున్న నేపథ్యం.. కల్మషం లేకుండా స్వచ్ఛంగా సాగుతోన్న సమయంలో ‘ఓ అలజడి’ ప్రవేశించింది. గ్రామీణ ప్రజల ఆనందాన్ని అణిచివేసే ‘కుట్ర’ మొదలైంది.. ఓ సంస్థ తప్పు..రాజకీయ అవసరం.. మోసగాళ్ల కుతంత్రాలు..అన్నీ కలిసి ఆ స్వచ్ఛమైన ఊరును అల్లకల్లోలం చేశాయి. తెలంగాణలోని ఓ పల్లెలో జరిగిన కథ.. వారి నిత్య జీవన విధానం మనల్ని హాయిగా నవ్వుల్లో ముంచెత్తుతుంది. ఆ స్వచ్ఛత మన మనసును దోచుకుంటుంది. మన పల్లెను మళ్లీ మనకు గుర్తుకు తెస్తది.. అంతేకాదు చూస్తున్నంత సేపు ఆ గ్రామంలో ఉన్నట్టే అనిపిస్తది.. ఈ చిత్రంలోని పాత్రల స్వభావం, వారి మాటలు, వారి పనులు ఎంత సహజంగా ఉన్నాయో! కష్టమొస్తే మద్దతుగా నిలిచే ఊరి జనాలు ఉంటారు. అర్థం చేసుకోకుండా సూటిపోటి మాటలతో బాధపెట్టే మనుషులూ ఉంటారు. అలాంటి విషయాలను కళ్ల ముందు ఉంచాడు దర్శకుడు రమేష్ చెప్పాల. పల్లె జనాల జీవితాల్లో రాజకీయ కల్మషం ఎలా బుసలు కొడతదో కూడా సూపెట్టింది ఈ సిన్మా. పల్లె కన్నీరు పెట్టిన విధానం ప్రతి ప్రేక్షకుడికి కంటతడి పెట్టిస్తది. ఆనందపరుస్తది.. ఆవేశపరుస్తది.. ఆందోళనపరుస్తది.. చివరికి మనుసును తేలికపరుస్తది.. ఒక మంచి ఫీల్ని గుండెల నిండా నింపుతది ఈ ‘భీమదేవరపల్లి బ్రాంచీ’ సిన్మా. సిన్మాల్లో గ్రామీణ నేపథ్యం ఉన్న కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటది. ఇటీవల వచ్చి సూపర్ హిట్ అయిన ‘బలగం’ కూడా ఒక ఉదాహరణ. ఈ తెలంగాణ నేపథ్య ‘భీమదేవరపల్లి బ్రాంచీ’ కూడా కచ్చితంగా ప్రతి ఒక్కళ్లకు నచ్చుతది. మన మనసును తాకుతది.. జంపన్న పాత్ర (అంజి బాబు) అందరినీ ఆకట్టుకుంటుంది. కొత్త కథ కావడం చేత ఆద్యంతం ఉత్కంఠత రేగింది… రచయిత తన మాటలతో నేటి రాజకీయాల మీద, ఉచిత పథకాల మీద తన మాటల వ్యంగ అస్త్రం సందించాడు. ఫస్టాఫ్ అంతా గ్రామీణ నేపథ్యం పాత్రల పరిచయం సున్నితమైన హాస్యంతో… సాగితే సెకండాఫ్… భావోద్వేగాలతో నిండిపోయింది. క్లైమాక్స్ లో జంపన్న సమ్మక్క ఇద్దరు ఆత్మహత్య చేసుకునే సన్నివేశంలో దర్శకుడు అందరి చేత కన్నీరు పెట్టిస్తాడు. “భీమదేవరపల్లి బ్రాంచి” సినిమా అద్భుతంగా వున్నది. దీంట్లో క్యారెక్టర్లు, యాక్టర్లు లేరు. జీవితాలు వున్నయ్ కృత్రిమ సెట్టింగులు లేవు. తెలంగాణ పల్లె వున్నది. పాటలు, మ్యూజిక్ ఊరు జీవితంలో యిమిడిపోయినయ్. ఫోటోగ్రఫీ పల్లె దృశ్య కావ్యమైంది. స్కీన్లకు తగ్గట్టుగా ఎడిటింగ్ చేసినరు. యిది చిన్న సినిమా కాదు. తెలంగాణ, కోస్తా, ఉత్తరాంద్ర, రాయలసీమ బీద, మధ్య తరగతి జీవన వెతలున్నయ్, నేటివిటీ కోసం తెలంగాణ భాష వుంటది గంతే. సపరేట్ కామెడీ ట్రాక్ లేదు. జీవిత సత్యాలతో కూడిన సెన్సాఫ్ హ్యూమర్ వున్నది. హీరో, హీరోయిన్ అనబడే యిద్దరు యువతీ-యువకుడి మధ్య అమలిన శృంగారమున్నది కె. విశ్వనాథ్ స్టైల్లో. దాంట్లో కూడా గ్రామీణ వాతావరణాన్ని చూపించినరు. ఊర్లో డప్పు కొట్టుకొని బ్రతికే జంపన్న కుటుంబం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.జంపన్న పాత్రలో (అంజి బాబు) చక్కని పర్ఫామెన్స్ చేశారు. దర్శకుడు మహారాష్ట్రలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ నుండి ప్రేరణ తీసుకొని కథ రాశారు. స్క్రీన్ ప్లే ఆద్యంతం ఉత్కంఠత రేగింది. కథలో మంచి మెసేజ్ కూడా ఉండడం అదనపు ఆకర్షణ. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరూ కొత్త వాళ్ళయినప్పటికీ దర్శకుడు వాళ్ళ దగ్గర నుంచి మంచి నటన రాబట్టుకున్నాడు. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ పరిధిలో మంచి ప్రతిభ కనబరిచారు.
సాంకేతికంగా చూస్తే.. ఈ సినిమా మేకింగ్ విషయంలో దర్శకుడు పరిణితి కనపరిచాడు. పూర్తి సినిమా ఎగ్జిక్యూషన్ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. చరణ్ అర్జున్ సంగీతం చాలా బాగుంది. నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ ఓకే, ఈ సినిమా పోస్టర్స్ అన్ని ఆసక్తికరంగా ఉన్నాయి. ‘భీమదేవరపల్లి బ్రాంచీ’అందరు థియేటర్కు వెళ్ళి చూడాల్సిన సినిమా. మీరు మట్టి వాసన పరిమళాలను ఆస్వాదిస్తారు. మీరు మట్టి వాసన పరిమళాలను ఆస్వాదిస్తారు. ‘భీమదేవరపల్లి బ్రాంచీ’అందరు థియేటర్ కు వెళ్ళి చూడాల్సిన సినిమా!