అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజే రూ.16.7 కోట్ల కలెక్షన్లతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ శనివారం బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించగా.. కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ వేడుకలో నాగ్ అఖిల్ సక్సెస్ చూసి కాస్త ఎమోషనల్ అయ్యారు. అఖిల్ హిట్ కోసం తాను దేవుడిని ఎలా వేడుకున్నారో చెప్పడంతో పాటు, ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్కు, అలాగే ఫ్యాన్స్ స్లోగన్ అందుకుంటూ వేదికపై నాగార్జున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆ విశేషాలు చూద్దాం..
అఖిల్ కెరీర్లోనే మునుపెన్నడూ లేని విధంగా ‘లెనిన్’ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజే ఏకంగా రూ. 16.7 కోట్ల గ్రాస్ వసూలు చేసి అఖిల్ స్టామినా ఏంటో నిరూపించింది. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అక్కినేని ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర పండగ చేసుకుంటున్నారు. ఈ భారీ విజయం అందించిన జోష్తోనే చిత్ర యూనిట్ గ్రాండ్గా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. సక్సెస్ మీట్లో నాగార్జున మాట్లాడుతూ ఒక తండ్రిగా చాలా ఎమోషనల్ అయ్యారు. నేను నా మూవీస్ కోసం ఎప్పుడు ఆ దేవుడిని అడగలేదు .. ఇక నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. కానీ ఇటీవల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా ఒక్కటే కోరుకున్నాను.. మా అఖిల్కు ఒక సాలిడ్ హిట్ ఇవ్వమని అడిగాను. ఆ స్వామివారి ఆశీస్సులతోనే ఈరోజు ‘లెనిన్’ హిట్ దక్కింది” అని నాగ్ చెప్పారు. ఈ సినిమాలో మరో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రానికి తన వాయిస్ ఓవర్ ఇచ్చారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపించారు. “మేము అడగ్గానే కాదనకుండా సినిమాకు వాయిస్ ఇచ్చిన మా పెద్దబ్బాయి తారక్ కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి” అంటూ నాగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ వాయిస్ సినిమాకు చాలా పెద్ద ప్లస్ అయిందని ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. అక్కినేని అఖిల్ ఫ్యాన్స్ ఎప్పుడూ వాడే ఫేమస్ స్లోగన్ ‘అయ్యగారే నెంబర్ 1’. ఈ సక్సెస్ మీట్ వేదికపై కింగ్ నాగార్జున కూడా ఇదే స్లోగన్ను రిపీట్ చేస్తూ ఫ్యాన్స్లో పూనకాలు తెప్పించారు. అఖిల్ 2.0 రేంజ్ మాస్ పర్ఫార్మెన్స్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే యాక్టింగ్ ఈ సినిమాను నిలబెట్టాయని, ఈ రోజుతో అఖిల్ సాలిడ్ హిట్ కొట్టాలనే కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ బ్లాక్ బస్టర్ మీట్ లో హీరో అఖిల్ అక్కినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, నిర్మాత సూర్యదేవర నాగవంశీ , దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు, ఈశ్వరి రావు, నటులు బ్రహ్మాజీ, శివాజీ తదితరులు పాల్గొని మాట్లాడారు. చాలా కాలం తర్వాత అక్కినేని క్యాంప్లో ‘లెనిన్’ రూపంలో ఒక అసలైన సక్సెస్ సెలబ్రేషన్ కనిపిస్తోంది. అటు దేవుడి ఆశీస్సులు, ఇటు తారక్ సపోర్ట్, ఫ్యాన్స్ అండతో అఖిల్ బాక్సాఫీస్ దగ్గర నెంబర్ 1 అనిపించుకున్నాడు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
భావోద్వేగానికి లోనైన భాగ్యశ్రీ!
ఎన్నో ఆటు పోట్లు తర్వాత వచ్చే విజయం అది ఇచ్చే ఫీలింగ్ ఎలా ఉంటుందో దానిని అనుభవించిన వారికే తెలుస్తుంది. ఇప్పుడు అలాంటి ఫీల్ లోనే యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఉందని చెప్పవచ్చు. టాలీవుడ్ లో ఆమె కెరీర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు వరకు చేసిన సినిమాలు కొన్నే కానీ ఆమెకి గుర్తింపు అయితే వచ్చింది కానీ.. గట్టి విజయం మాత్రం దక్కలేదు. అయితే దానిని ఇపుడు ‘లెనిన్’ రూపంలో దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు అందించారు. అఖిల్ తో చేసిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడమే కాకుండా సాలిడ్ ఓపెనింగ్స్ కూడా రాబట్టింది. దీనితో మేకర్స్ ఏర్పాటు చేసిన బ్లాక్ బస్టర్ మీట్ లో భాగ్యశ్రీ చాలా భావోద్వేగానికి లోనైంది. దర్శకుడికి మొదటిగా థాంక్స్ చెబుతూ ఆమె హైదరాబాద్ ని తన కర్మభూమి అంటూ ఎంతో ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది. కన్నీరు పెడుతూ తన కెరీర్ లో ఆఖరి సినిమా కూడా ఇక్కడే ఉండాలని చెప్పడం ఒకింత ఆమెకి మన దగ్గర ఎంతటి అనుబంధం ఏర్పడిందో అర్ధం అవుతుంది. దీనితో ఈ యువ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్ గా మారాయి.
