* ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024’ ప్రధానోత్సవం ..ఓ విశ్లేషణ
* సినీ తారలతో దద్దరిల్లిన హైటెక్స్ ప్రాంగణం
‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024’ ప్రధానోత్సవ కార్యక్రమం శనివారం హైదరాబాద్లోని హైటెక్స్లో ఘనంగా జరిగింది. 14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమాకు ప్రాంతీయ అవార్డులు ఇచ్చింది. ఈ తెలుగు సినిమా అవార్డ్స్ వేడుకను నిర్వహించుకోవడం శుభ పరిణామం. 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి జ్యూరీ ఎంపిక చేసిన చిత్రాలకు అవార్డ్స్ ఇవ్వడం సంతోషకరం. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఇంత వైభవంగా నిర్వహించుకోవడానికి కారణమైన తెలంగాణ సీఎం ఎ. రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను చిత్రసీమ మరోసారి అభినందించింది. ఇందులో భాగంగా 2024 ఏడాదికి గాను తెలుగు చలనచిత్రాలకు చెందిన వివిధ కేటగిరీల్లో విజేతలతో పాటు 2014-2023 వరకు ఉత్తమ ప్రథమ, ద్వితీయ, తృతీయ చలనచిత్రాలకు, ఉత్తమ నటీనటులు, దర్శక నిర్మాతలకు సైతం ఈ పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమానికి యావత్ చిత్ర పరిశ్రమ కదిలొచ్చింది. తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్ డీసీ) చైర్మన్ దిల్ రాజు, ఎండీ ఎస్. హరీష్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. రెడ్కార్పెట్పై సినీ ప్రముఖులు సందడి చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే అవార్డ్స్ ఫంక్షన్కు సంబంధించిన సావనీర్ను వారిద్దరూ ఆవిష్కరించారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ మెమెంటోనూ రూపొదించిన రమావత్ నాగుల నాయక్ను, జ్యూరీ చైర్మన్ మురళీమోహన్, చైర్పర్సన్ జయసుధ, సభ్యులు కే దశరథ్, డీవీకేరాజు, ఊహ తదితరులను జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఎస్. తమన్, ఎం.ఎం కీరవాణి, గాయకులు రామ్ మిరియాల, మంగ్లీ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గద్దర్ను గుర్తు చేసుకుంటూ మంగ్లీ ‘పొడుస్తున్న పొద్దుమీద, బండెనక బండికట్టి’ పాటలు ఆలపించారు. పాతతరం కథానాయికలు జయప్రద, జయసుధ, సుహాసిని, ఒకేఫ్రేమ్లో కనిపించి అలరించారు. భీమ్స్ సిసిరోలియో తల్లితో పాటు కలసి పురస్కారం అందుకున్నారు. ఆ సందర్భంలో ఆయన తల్లిని ముద్దాడిన దృశ్యం మనసుకు హత్తుకుంది. ముందుగా వ్యక్తిగత అవార్డ్స్ విభాగం ప్రధానంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ పురస్కారాలను అందజేశారు. తర్వాత రేవంత్రెడ్డి చేతుల మీదుగా తొలిపురస్కారాన్ని ‘రజాకార్’ చిత్రానికి గాను ఉత్తమ నిర్మాతగా గూడురు నారాయణరెడ్డి, దర్శకుడు యాట సత్యనారాయణకు అందజేశారు. ఉత్తమ ప్రజాదరణ చిత్రం కేటగిరిలో ‘ఆయ్’ చిత్రానికి గాను బన్నీ వాసు తరపున అల్లు అరవింద్ పురస్కారం అందుకున్నారు. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ను సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా నందమూరి బాలకృష్ణ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘తెలంగాణ ప్రభుత్వం బ్రహ్మాండమైన ఉత్సవాన్ని జరుపుతోంది. గద్దరన్న తెలంగాణ ముద్దుబిడ్డ. ఆయన పేరును చిరస్ఙాయిగా నిలబెట్టేలా ఈ అవార్డ్లు ఇవ్వడం గొప్ప విషయం. అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ధన్యవాదాలు. 1996లో ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఇవ్వడం మొదలైంది. మధ్యలో ఆగిపోయింది. మళ్లీ పదేళ్ల తర్వాత తిరిగి ఎన్టీఆర్ అవార్డ్ను ఇస్తున్నందుకు నా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవార్డ్కు తొలి గ్రహీతగా ఎంపికవ్వడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ పురస్కారంతో పాటు ఇచ్చే నగదు బహుమతిని బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్కు రేవంత్ అన్న ఇచ్చినట్లు భావిస్తున్నాను’ అని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాక అల్లు అర్జున్ ను మాట్లాడమన్నారు. ప్రేక్షకులు డైలాగ్ డైలాగ్ అని అరిచారు. మీరు అనుమతి ఇస్తే సినిమా అవార్డులు కాబట్టి ‘పుష్ప 2’ లో ఒక డైలాగ్ చెబుతా సరదాగా అని రేవంత్ రెడ్డిని అడిగారు అల్లు అర్జున్ నవ్వుతూ. ఆయన కూడా నవ్వుతూ గో ఎ హెడ్ అని చేత్తో సైగ చేశారు. జాతర సన్నివేశంలో “ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా గంగమ్మ తల్లి మీద ఒట్టు జాతర లో వేట తలలను నరికినట్లు రప్పరప్పా నరుకుతా ఒక్కొక్కడ్ని” అని డైలాగ్ చెప్పిన అల్లు అర్జున్ చివర్లో “పుష్ప పుష్పరాజ్ అస్సలు తగ్గేదేలా” అని తనదైన మార్క్ యాక్షన్ తో చెప్పారు. హైటెక్స్ హాలు చప్పట్తో ఓయోలతో దద్దరిల్లింది! వేదిక నవ్వులతో నిండిపోయింది! రేవంత్ రెడ్డి కూడా చప్పట్లు కొట్టారు నవ్వుతూ! ప్రతి యేటా ఇలాగే అవార్డుల వేడుక జరగాలని, తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసి అవార్డులు ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ ముఖ్యమంత్రి పేరుతో పాటు వేదిక పై వున్న అందరి పేర్లు బుద్ధిగా గుర్తు పెట్టుకుని మరీ ధన్యవాదాలు చెప్పారు అల్లు అర్జున్. ఒకవేళ ఎవరి పేరు అయినా మరచిపోతే క్షమించమని కోరాడు. అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్న తీరు చూసి మొదటి వరస ప్రేక్షకుల్లో కూర్చున్న అల్లు అరవింద్ నవ్వుకుంటూ కనిపించారు. చివరగా జై తెలంగాణ అని అల్లు అర్జున్ తన స్పీచ్ ముగించడంతో హాలు కరతాళ ధ్వనులతో మార్మోగింది!
”సినిమా పరిశ్రమను ఒకతాటిపైకి తెచ్చి గద్దరన్న పేరుతో అవార్డులు ఇవ్వడం ఆనందంగా ఉంది. కాంతారావు గారి పేరు మీద ఇచ్చే అవార్డ్ను స్వీకరిస్తున్న తొలి నటుడిగా నా బాధ్యతను మరింత పెంచింది. రేవంత్రెడ్డి గారికి ధన్యవాదాలు” అని హీరో విజయ్ దేవరకొండ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే 1964లో సినీ పరిశ్రమను గౌరవించి నంది అవార్డులను ప్రవేశపెట్టింది. తెలంగాణ ఏర్పడిన తరువాత ఆగిపోయిన నందిని తెలంగాణ ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరిట మార్చి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. మా ప్రభుత్వం సినీ రంగం పట్ల కొంత కఠినంగా కనిపించినా ఆది కేవలం సినీ పరిశ్రమ అభివృద్ధి కోసమే. మీకు ఏం కావాలో చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. మీకు అండగా ఉంటుంది. ఇంకో 22 ఏళ్ళు నేను రాజకీయ రంగంలోనే ఉంటాను. ఏ హోదాలో ఉన్నప్పటికీ సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకారం అందిస్తూనే ఉంటాను. ఐటి పరిశ్రమను ప్రోత్సహించినట్లుగానే సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం. 2047 విజన్ డాక్యుమెంట్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం ఉంటుంది. దిల్ రాజు గారు మీరు అందరితో చర్చించి ఒక ప్రణాళిక రూపొందించి ఇవ్వండి. 2047వ నాటికి తెలంగాణ ఎకానమిని మూడు మిలియన్ డాలర్లకు చేరుస్తాం. నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేటు వున్నవాడ్ని. నా అంచనాలు ఎప్పుడు ఫెయిల్ కాలేదు.
గద్దరన్న మా ప్రభుత్వానికి స్ఫూర్తి. గద్దరన్న అంటే ఒక విప్లవం. గద్దరన్న అంటే ఒక పోరాటం. గద్దరన్న అంటే ఒక వేగుచుక్క. ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి గద్దర్ పోరాట స్పూర్తితో ముందుకు తీసుకెళ్లుతున్నాం. తెలంగాణ అభివృద్ధిలో గద్దరన్న స్ఫూర్తి ఉంటుంది. తెలంగాణ అభివృద్ధికి సినీ పరిశ్రమ సహకరించాలి. భట్టి గారు నాదొక విన్నపం. ఓల్డ్ సిటీ లో మంచి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అనే కుర్రాడు వున్నాడు. అతడికి అవార్డు ఇవ్వండి. ఫైనాన్స్ మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఏదొక విధంగా అతనికి అవార్డు ఇచ్చి ప్రోత్సహించండి అని వేదిక పై నుంచి రేవంత్ రెడ్డి కోరారు. ప్రేక్షకుల్లో కూర్చుని వున్న భట్టి విక్రమార్క “మీరే అనౌన్స్ చేయండి” అని చేతులు ఊపుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ చప్పచప్పగా సాగుతున్న వేళ… కాస్త అలస్యంగానైనా రేవంత్ రెడ్డి వచ్చారు. అప్పటి వరకు ఏదో ఏమో అన్నట్లుగా సాగిన వేడుకకు కొత్త జోష్ వచ్చింది. ఈలలు చప్పట్ల గోలతో హైటెక్స్ హోరెత్తింది. వేదిక ముందు వరసలో కూర్చున్న నందమూరి బాలకృష్ణ ను పలకరించిన రేవంత్ రెడ్డి దగ్గరకు హత్తుకున్నారు. ఆ పక్కనే నిలబడి చూస్తున్న అల్లు అర్జున్ కు ఒక హగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆడిటోరియం కరతాళధ్వనులతో మార్మోగిపోయింది. రేవంత్ రెడ్డి రాకతో కొత్త జోష్ వచ్చింది.
అప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్ రాజు కొందరికి అవార్డులు ఇచ్చేసి అభినందించారు. అలనాటి తారలు జయసుధ, జయప్రద, సుహాసిని కలసి మరి కొందరికి ఇచ్చారు. గాయని మంగ్లీ తన బృందంతో ఉర్రూతలూగించింది. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్ఞాపిక పై గద్దర్ మొఖం లేకున్నా గద్దర్ చెయ్యి, గద్దర్ డప్పు పెట్టారు. గద్దర్ పేరు పెట్టారు. గద్దర్ కుటుంబానికి కోటి రూపాయలు, గద్దర్ ఫౌండేషన్ కు మూడు కోట్లు, నెక్లేస్ రోడ్ లో రెండు ఎకరాలు, కుమార్తెకు సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ పోస్ట్, ప్రతి యేటా అధికారికంగా గద్దర్ జయంతి. ఇన్ని వరాలు ఇచ్చాక ఒక్క సినిమా అవార్డ్స్ జ్ఞాపిక పై మొఖం లేదని, ఆహ్వానపత్రం పై ఫోటో లేదని బాధ పడటం ఎందుకు? కెసిఆర్ అప్పోయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అప్పుడు ఎవ్వరూ ఏమి అనలేకపోయారు. రేవంత్ రెడ్డి ఇన్ని ఇచ్చినా, రెండు వారాల వ్యవధి లోనే వారి కుటుంబానికి నాలుగు కోట్లు ఇచ్చినా ఇంకా విమర్శకులు ఈకలు పీకుతున్నారు. ఎంత దురదృష్టకరం!
ప్రతిష్టాత్మక “తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2024” వేడుక హైదరాబాద్ హైటెక్స్లో కన్నుల పండుగగా సాగింది. అత్యంత వైభవంగా సాగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని వివిధ విభాగాల్లో ఉత్తమ అవార్డులకు ఎంపికైన ప్రముఖులకు పురస్కారాలను అందించారు. 14 ఏళ్లుగా నిలిచిపోయిన ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రజా ప్రభుత్వం పునరుద్ధరించడమే కాకుండా 2014-24 వరకు పదేళ్ల కాలానికి గానూ సినిమా రంగంలో ఉత్తమ అవార్డులతో పాటు చలనచిత్ర వైతాళికుల పేరుతో నెలకొల్పిన ప్రత్యేక పురస్కారాలను కూడా ఈ వేడుక ద్వారా అందించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుల సమక్షంలో ముఖ్యమంత్రి అవార్డులకు ఎంపికైన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులు, చలన చిత్ర పరిశ్రమలో విశేష కృషి చేసిన ప్రముఖులకు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులను అందజేశారు. ఎన్టీఆర్ జాతీయ ఫిల్మ్ అవార్డును నందమూరి బాలకృష్ణకి, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డును మణిరత్నంకి, బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డును శ్రీసుకుమార్కి, నాగిరెడ్డి – చక్రపాణి ఫిల్మ్ అవార్డును అట్లూరి పూర్ణచందర్ రావుకి, కాంతారావు ఫిల్మ్ అవార్డును విజయ్ దేవరకొండకి, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డును యండమూరి వీరేంద్రనాథ్కి, ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్ కి, ఉత్తమ నటి అవార్డును నివేదా థామస్ కి అందజేశారు. ఇవే కాకుండా అనేక విభాగాల్లో అవార్డులను అందజేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీతలు చంద్రబోస్, ఎంఎం కీరవాణిలను ఈ వేదికగా ముఖ్యమంత్రి సత్కరించారు. గద్దర్ జయంతి వేడుకల నిర్వహణలో భాగస్వామ్యం కల్పిస్తూ ప్రభుత్వం తరఫున మూడు కోట్ల రూపాయలకు సంబంధించిన పత్రాన్ని గద్దర్ ఫౌండేషన్ సూర్యకిరణ్ కు అందజేశారు. సినీ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రజాగాయకుడు గద్దర్ పేరిట అవార్డులను పునరుద్ధరించడం పట్ల నటీనటులు, సినీ పరిశ్రమ ప్రముఖులు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. పేరిణి నాట్య ప్రదర్శన ఈ వేడుకకు శుభారంభపు వెలుగునిచ్చింది. కీరవాణి బృందం విభావరి జై తెలంగాణ రాష్ట్ర గీతం విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుకలో జై తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సంగీత దర్శకుడు కీరవాణి బృందం ఆలపించి ఆహూతులను విశేషంగా అలరించింది.
-ఎం.డి అబ్దుల్