‘శంబాల’ చిత్రంతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ను అందుకున్న హీరో ఆది సాయి కుమార్, ఇప్పుడు స్ట్రాంగ్ కమర్షియల్, కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాల వైపు దృష్టి పెడుతున్నారు. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో తెరకెక్కనున్న తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను ఆయన ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ‘కె-ర్యాంప్’ సంచలన విజయంతో దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ నిర్మాత రాజేష్ దండా, హాస్య మూవీస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కృష్ణకాంత్ పరుచూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ సరసన బంధవి శ్రీధర్ కథానాయికగా నటిస్తున్నారు. ‘సైరాబాను’ అనే ఆసక్తికరమైన టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని, ఆకట్టుకునే పోస్టర్ ద్వారా ఆవిష్కరించారు. ఈ పోస్టర్ డిజైన్ ఉత్సాహభరితమైన రొమాంటిక్ వాతావరణాన్ని ప్రజెంట్ చేస్తోంది. సాఫ్ట్ పాస్టెల్ రంగులతో అద్దిన ఒక హార్ట్ షేప్ గులాబీ మేఘం, పోస్టర్ పైభాగంలో తేలుతున్నట్లుగా ఉంది. పోస్టర్ లో నీటితో తడిసిన చార్మినార్, ప్రశాంతమైన వైజాగ్ బీచ్ రోడ్, రాజమండ్రి గోదావరి వంతెన, ఇవన్నీ బ్యాక్ డ్రాప్ లో వుండటం మరింత ఆసక్తిని పెంచుతోంది. నిర్మలమైన, ప్రశాంతమైన ఆకాశం, చెల్లాచెదురుగా ఉన్న మేఘాలు ఈ విజువల్కు మరింత అందాన్ని జోడించాయి. ఫణి కృష్ణ సిరికి, రాజమండ్రి, హైదరాబాద్ నేపథ్యంలో సాగే కథనంతో, హాస్యం మేళవించి ఒక ప్రత్యేకమైన హిందూ-ముస్లిం ప్రేమకథను రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ ఈరోజు పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో కిరణ్ అబ్బవరం క్లాప్ కొట్టారు. దర్శకుడు రామ్ అబ్బరాజు, సాయి కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కోన వెంకట్, కే రాంప్ డైరెక్టర్ నాని మేకర్స్కి స్క్రిప్ట్ అందించారు. తొలి సన్నివేశానికి దర్శకుడు యోగి గౌరవ దర్శకత్వం వహించారు. బలమైన టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తోంది. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్గా, శేఖర్ చంద్ర సంగీత దర్శకుడిగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కదలి ప్రొడక్షన్ డిజైనర్గా పనిచేస్తున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
ఆది సాయి కుమార్ ‘సైరాబాను’ ప్రారంభం
