హైదరాబాద్: సామాజిక, రాజకీయ తెలుగు దినపత్రిక ‘రాయల్ పోస్ట్’ ప్రచురించిన ప్రత్యేక న్యూ ఇయర్-2022 క్యాలెండర్ ఆవిష్కరణ వైభవంగా జరిగింది. గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాయల్ పోస్ట్ న్యూ ఇయర్ 2022 క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్య తరహా దినపత్రికలు, మరియు మ్యాగజైన్స్ అసోసియేషన్, మైనారిటీ జర్నలిస్ట్స్ ఫ్రంట్ అధ్యక్షులు యూసుఫ్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జరిగిన ఆవిష్కరణలో సీనియర్ జర్నలిస్ట్, మైనారిటీ జర్నలిస్ట్స్ ఫ్రంట్ సెక్రటరీ మహమ్మద్ షరీఫ్, సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత, టాలీవుడ్ టైమ్స్ ఎడిటర్, మైనారిటీ జర్నలిస్ట్స్ ఫ్రంట్ జాయింట్ సెక్రటరీ ఎం.డి.అబ్దుల్, టీజేయూ స్టేట్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్, ‘రాయల్ పోస్ట్’ ఎడిటర్ మహమ్మద్ ఖాజా ఫసియొద్దీన్, జనత టీవి సిఈఓ మహమ్మద్ షానూర్ బాబా, జనత టీవి స్టేట్ బ్యూరో షేక్ రషీద్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ మేనేజర్ కానుకటి రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా న్యూ ఇయర్ 2022 క్యాలెండర్ ఆవిష్కరణోత్సవంలో తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్య తరహా దినపత్రికలు, మరియు మ్యాగజైన్స్ అసోసియేషన్, మైనారిటీ జర్నలిస్ట్స్ ఫ్రంట్ అధ్యక్షులు యూసుఫ్ బాబు మాట్లాడుతూ గత పదేళ్లుగా సామాజిక, రాజకీయ తెలుగు దినపత్రిక ‘రాయల్ పోస్ట్’ ఉన్నతమైన ఆశయాల సాధనకోసం, ప్రజాసమస్యలపై నిరంతరం పాటుపడుతుందని అన్నారు. ‘రాయల్ పోస్ట్’ ఎడిటర్ మహమ్మద్ ఖాజా ఫసియొద్దీన్ కు జర్నలిస్టుగా మంచి అనుభవం ఉందని, ఆ అనుభవంతోనే పత్రికను నడుపుతూ ఎన్ని అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో క్రమం తప్పకుండా పత్రికను ప్రజల ముంగిళ్లలోకి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. అంతే కాకుండా గత పదేళ్లుగా ‘రాయల్ పోస్ట్’ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ప్రజలకు కానుకగా అందిస్తున్నారని చెప్పారు. పత్రికలంటే ప్రజలకూ.. ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండాలని, సమస్య పరిష్కారంలో సైతం ప్రభుత్వానికి సూచనలివ్వాలని ఆయన తెలిపారు. ఒక పత్రికగా ప్రజాసమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేయడమే కాకుండా ప్రభుత్వానికి తగిన పరిష్కార మార్గం చూపించాల్సిన భాద్యతను మరచిపోకూడదన్నారు.