తెలంగాణ తొలి మహిళా సీఎస్‍ శాంతికుమారికి ‘దీనశరణ్య’ శుభాకాంక్షలు

తెలంగాణ తొలి మహిళా సీఎస్‍గా నియామకమైన శాంతికుమారికి శుభాకాంక్షలు అందజేస్తున్న 'దీనశరణ్య' స్వచ్చంద సేవాసంస్థ చైర్మన్ చింతల సాయిబాబా, రాజేంద్రప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత ఎం.డి అబ్దుల్
Spread the love

తెలంగాణ తొలి మహిళా సీఎస్‍గా నియామకమైన శాంతికుమారిని కలిసి ‘దీనశరణ్య’ స్వచ్చంద సేవాసంస్థ శుభాకాంక్షలు అందజేసింది. గురువారం బీఆర్కే భవన్ లోని రాష్ట్ర సచివాలయంలో సీఎస్‍ ను కలిసిన వారిలో ఆ సంస్థ చైర్మన్ చింతల సాయిబాబా, సీనియర్ జర్నలిస్ట్, నంది అవార్డు గ్రహీత, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎం.డి అబ్దుల్, రాజేంద్రప్రసాద్ ఉన్నారు. ప్రస్తుతం సీఎస్ సోమేశ్ కుమార్ రిలీవ్ కావడంతో శాంతికుమారిని తదుపరి సీఎస్ గా నియమించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు ఆమెను సీఎస్ గా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వి. శేషాద్రి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమె తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్ గా చరిత్రకెక్కారు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి మహిళా సీఎస్ గా ఈ మేరకు ఆమె రికార్డ్ సృష్టించారు. సీఎస్ రేసులో సీనియర్ ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, రామకృష్ణారావు, రజత్ కుమార్, శాంతికుమారి, రాణి కుమిదిని, శశాంక్ గోయల్, వసుధా మిశ్రా, అశోక్ కుమార్, సునీల్ శర్మ ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ శాంతికుమారివైపే మొగ్గుచూపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారు. గత సీఎస్ సోమేశ్ కుమార్ ను ఏపీ కేడర్ కు వెళ్లాలని ఆదేశిస్తూ మంగళవారం రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో కొత్త సీఎస్ నియామకం అనివార్యంగా మారిన విషయం తెలిసిందే. 1989 బ్యాచ్ కు చెందిన శాంతకుమారి గతంలో సీఎం కార్యాలయంలో పని చేశారు. ఆమె 2025 ఏప్రిల్ వరకు సీఎస్ గా కొనసాగనున్నారు. శాంతి కుమారి ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివారు. అమెరికాలో ఎంబిఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్ గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్ మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా పని చేశారు. శాంతికుమారి ప్రస్తుతం అటవీశాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అసిస్టెంట్ కలెక్టర్ నుంచి స్పెషల్ సీఎస్ దాకా శాంతికుమారిని నియమించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ‘దీనశరణ్య’ స్వచ్చంద సేవాసంస్థ చైర్మన్ చింతల సాయిబాబా ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.
శాంతికుమారి 1999 నవంబర్ నుంచి 2001 జూన్ వరకు మెదక్ జిల్లా కలెక్టర్ గా పనిచేయగా, అప్పట్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్ధిపేట నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించారు. 2015-2018 వరకు శాంతికుమారి సీఎంఓ ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు. ఈ విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో కొన్నేళ్లపాటు కలిసిపనిచేసిన అనుభవం ఉండడంతో పాటు, నమ్మకస్తురాలు కావడం ఎన్నికల సంవత్సరంలో ఆమెను సీఎస్ గా నియమించడానికి దోహదపడింది. రెండేళ్ల మూడు నెలలకు పైగా సర్వీసు మిగిలిఉన్న శాంతికుమారి 2025 ఏప్రిల్ లో పదవీ విరమణ చేస్తారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర తొలి మహిళా సీఎస్ గా మిన్నీమాత్యుస్ 2012లో నియమితులయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాష్ట్ర తొలి మహిళా సీఎస్ గా నీలం సహానీ వ్యవహరించారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మూడో మహిళా సీఎస్ శాంతికుమారి కావడం గమనార్హమని చింతల సాయిబాబా మీడియాతో మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సీఎస్ శాంతికుమారిని ఈ సందర్బంగా యాదాద్రిభువనగిరి జిల్లాలో పర్యటించాలని కోరినట్టు, అందుకు ఆమె సుముఖత వ్యక్తం చేసినట్టు ఆయన తెలిపారు. ఈ ప్రాంత మరింత అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని సీఎస్ చెప్పారని సాయిబాబా పేర్కొన్నారు.

Related posts

Leave a Comment