రాష్ట్రంలో దీనస్థితిలో ఉన్న గ్రామీణ విలేకరుల జీవితాలపై పాలకులు దృష్టిసారించి వారిని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ కోరారు.
ఆదివారం నాడు భద్రాచలంలో జరిగిన టీయుడబ్ల్యుజె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ద్వితీయ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాత్రి పగలు శ్రమించే విలేకరుల సంక్షేమాన్ని అటు యాజమాన్యాలు, ఇటు ప్రభుత్వం విస్మరించడం విచారకరమని విరాహత్ ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరులు విలాసవంతమైన జీవితాలను ఆశించడం లేదని, కనీస అవసరాలైన గూడు, ఆరోగ్య భద్రత, పిల్లలకు ఉచిత విద్యను కోరుతున్నట్లు అయన స్పష్టం చేశారు. ఈ సభకు గౌరవ అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు రేగ కాంతారావు మాట్లాడుతూ వార్తల సేకరణలో విలేకరుల శ్రమ వెలకట్టలేనిదన్నారు. తమ జిల్లాలో విలేకరుల కనీస అవసరాలు తీర్చేందుకు తనవంతు కృషిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయుడబ్ల్యుజె రాష్ట్ర నాయకులు రాంనారాయణ, ఏ.రాజేష్ , యూసుఫ్ బాబు, ప్రసేన్, వెంకట్రావ్, వనం వెంకటేశ్వర్లు, ఖాదర్ పాషా తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల బ్రతుకులపై దృష్టి పెట్టండి : భద్రాద్రి మహాసభలో టీయుడబ్ల్యుజె నేత విరాహత్ అలీ
