జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి స్మృత్యర్థం శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు ప్రదానం చేసే విశ్వంభర జాతీయ సాహిత్య పురస్కారానికి ఈ సంవత్సరం ప్రముఖ మలయాళీ కవి కె. సచ్చిదానందన్ ను ఎంపిక చేశారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే డాక్టర్ సి.నారాయణరెడ్డి 95వ జయంత్యుత్సవంలో సచ్చిదానందన్ ను 5 లక్షల రూపాయల నగదు, జ్ఞాపిక,ప్రశంసాపత్రంతో సత్కరించనున్నట్టు ట్రస్టు అధ్యక్షులు సి.గంగ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆధునిక మలయాళ కవులలో అగ్రశ్రేణికి చెందిన సచ్చిదానందన్ కవిగా, సాహిత్య విమర్శకునిగా, నాటక కర్తగా, సంపాదకునిగా, కాలమిస్టుగా, అనువాదకునిగా ఢిల్లీ కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా బహుముఖీన సేవలు అందించారు. ఆయన కవితలు మలయాళం ఇతర భారతీయ భాషల్లో 18 సంపుటాలుగా వెలువడ్డాయి. త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనారెడ్డి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి సచ్చిదానందన్ కు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రదానం చేస్తారని ట్రస్టు అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు.
మలయాళీ కవి కె. సచ్చిదానందన్ కు సినారె ‘విశ్వంభర’ జాతీయ పురస్కారం
