‘మా’ ఆధ్వర్యంలో ముగిసిన పావలా శ్యామల అంత్యక్రియలు

Pavala Shyamala's funeral rites concluded under the aegis of MAA
Pavala Shyamala's funeral rites concluded under the aegis of MAA
Spread the love

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున‌ 1.52 నిమిషాల‌కు గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. బుధవారం (జూలై 29) ఆమె అంత్యక్రియలు ‘మా’ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ అంత్యక్రియలకు మురళీమోహన్, నరేష్‌ తో పాటు మా సభ్యులు శివబాలాజీ, రాజీవ్ కనకాల, రఘు బాబు, మాదాల రవి, కరాటే కల్యాణి, అనిత చౌదరి, హేమ వంటి వారంతా హాజరై పావలా శ్యామలకు నివాళులు అర్పించారు. రంగస్థలంపై నటిగా పరిచయమైన పావలా శ్యామల, ఆ తర్వాత టీవీ, సినిమా రంగాల్లో పలు వైవిధ్యమైన పాత్రలు చేసి, తన నటనా పటిమను చాటుకున్నారు. గ‌త కొంతకాలంగా ఆమె తీవ్ర‌ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతోన్న విషయం తెలియంది కాదు. ఆమె పరిస్దితి బాగోనప్పుడు ‘మా’ అసొషియేషన్‌తో పాటు ఇండస్ట్రీకి చెందిన ఎంతో ఆమెను ఆదుకున్నారు‌‌‌‌‌‌‌‌. ప్రస్తుతం ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఆదేశాలతో దగ్గరుండి పావలా శ్యామల అంత్యక్రియలను మా మెంబర్స్ నిర్వహించారు. పావలా శ్యామల కుమార్తె బాధ్యతను అన్నివిధాలుగా చూసుకుంటామని ఈ సందర్భంగా మా సభ్యులు తెలిపారు. పావలా శ్యామల అంత్యక్రియల విషయానికి వస్తే.. బుధవారం ఉదయం వనస్థలిపురంలోని రెడీ టూ సర్వ్ ఆశ్రమం నుంచి ఆమె భౌతికకాయాన్ని ఫిల్మ్ నగర్ మహాప్రస్థానానికి తరలించారు. ఉదయం 11 గంటలకు ఆమె అంత్యక్రియలను ప్రారంభించారు. పావలా శ్యామల అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను నటి కరాటే కళ్యాణి దగ్గరుండి చూసుకున్నారు. 1984లో చిరంజీవి ‘ఛాలెంజ్’ సినిమాతో తెరంగేట్రం చేసిన పావ‌లా శ్యామ‌ల.. సుమారు 100కు పైగా సినిమాల్లో న‌టించారు. చివ‌ర‌గా 2019లో వ‌చ్చిన ‘మ‌త్తు వ‌ద‌ల‌రా’ చిత్రంలో ఆమె క‌నిపించారు. 2014 నుంచి తీవ్ర ఆర్థిక, వృద్దాప్య స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఆమె.. తన కుమార్తెతో క‌లిసి దీనస్థితిలో కాలం వెళ్ళదీస్తూ వచ్చారు. పావలా శ్యామల మృతికి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం తీవ్ర సంతాపాన్ని తెలియజేసింది. దర్శకుల సంఘం ట్రస్ట్ తరఫున యాభై వేలు, దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు తరఫున యాభైవేలు కలిపి.. మొత్తం లక్ష రూపాయలు విరాళాన్ని తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ప్రకటించింది.