డి.వి.ఎస్ రాజు 97వ జయంతి వేడుక : డి.వి.ఎస్.రాజు ప్రాతః కాల స్మరణీయులే!

DVS Raju's 97th birth anniversary celebration: DVS Raju is a memory of the times!
DVS Raju's 97th birth anniversary celebration: DVS Raju is a memory of the times!
Spread the love

తెలుగు సినిమాకు అపారమైన సేవలందించిన డి.వి.ఎస్ రాజు 97వ జయంతి శనివారం జరిగింది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్న తెలుగు సినిమా రంగాన్ని ఎఫ్.డి.సి అధ్యక్షుడుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తరలించడంలోను, రిచర్డ్ అటెన్ బరో నిర్మించిన ఆస్కార్ అవార్డు సినిమా గాంధీ లాభాల్లో కొంత భాగాన్ని ఎన్.ఎఫ్.డి.సి అధ్యక్షుడుగా భారతీయ కార్మికుల నిధిని ఏర్పాటు చెయ్యడంలోను డి.వి.ఎస్ రాజు కీలకమైన భూమిక పోషించారు. రాజుగా సినిమా నిర్మాణం చేస్తూనే సినిమా రంగ సంస్థలను బలోపేతం చెయ్యడంలో విశేషమైన కృషి చేశారు. 1950 లో మహానటుడు ఎన్.టి.రామారావుతో పరిచయం రాజు గారి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. రాజు గారిని తన భాగస్వామిగా చేసుకొని నేషనల్ ఆర్ట్ థియేటర్ సంస్థలో ఎన్.టి.ఆర్ ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించారు. 1960లో రాజు గారు డి.వి.ఎస్ ప్రొడక్షన్స్ సంస్థను ప్రారంభించారు . అయినా రాజు గారితో రామారావు గారి మైత్రీ బంధం కొనసాగింది.
చైనా యుద్ధం, రాయలసీమ కరువు, దివిసీమ ఉప్పెన లాంటి విపత్తులు సంభవించినప్పుడు ఎన్.టి.రామారావు నాయకత్వంలో ప్రజలకు అండగా నిలబడే కార్యక్రమాలను రాజు గారే సమన్వయము చేసేవారు. 1983లో రామారావు ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టిన తరువాత రాజు గారిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థకు అధ్యక్షుడుగా నియమించారు. తెలుగు సినిమాను హైదరాబాద్ తీసుకురావడంలో, 1986 లో ఫిల్మోత్సవ్ కోసం పబ్లిక్ గార్డెన్ లో 90 రోజుల్లో లలిత కళాతోరణం నిర్మాణం కావడంలో, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించడంలో రాజు గారి పాత్ర అనన్య సామాన్యము. ఫిలిం నగర్ సోసిటీ, చలన చిత్ర వాణిజ్య మండలి, దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి, ఎఫ్ .డి .సి, ఎన్ .ఎఫ్ .డి .సి, ఫిలిం ఫెడరేషన్, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ మొదలైన సంస్థల అభివృద్ధిలో రాజు గారి కృషి ఎంతో వుంది, రాజు గారి నిస్వార్ధ సేవ, అంకిత భావం, అవిరళ కృషి ని గుర్తించిన భారత ప్రభుత్వం 2001వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది. రాజు గారు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆరోగ్యకరమైన, సందేశాత్మక చిత్రాలను రూపొందించారు. డిసెంబర్ 13, 1928న తూర్పు గోదావరి జిల్లా అల్లవరం జన్మించారు. నవంబర్ 13న 2010లో భౌతికంగా మనకు దూరమయ్యారు. తెలుగు సినిమా రంగంలో డి.వి.ఎస్.రాజు గారు ప్రాతః కాల స్మరణీయులే! శనివారం డి.వి.ఎస్. రాజు జయంతి వేడుకలు హైదరాబాద్ లోని ఎఫ్.ఎన్.సి.సిలో లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో అట్లూరి పూర్ణ చంద్ర రావుని ఘనంగా సత్కరించారు. మేము సైతం ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ కి డి.వి.ఎస్. రాజు గారి కుమారుడు డడీవీకే రాజు లక్ష రూపాయల చెక్ విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో కె ఎస్ రామారావు, రఘురామ కృష్ణం రాజు, టీడీ జనార్దన్, జెమిని కిరణ్, కె.ఎల్ నారాయణ, రంగారావు, నరసింహారావు, ప్రసన్న కుమార్, శివాజీ రాజా, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ఎడిద రాజా, నటుడు బెనర్జీ, డి.వి.ఎస్ రాజు గారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.