తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన వచ్చింది : సీఎం రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన గుంటుక వెంకటేశ్వర్ రెడ్డి

Democratic rule has come in Telangana: Guntuka Venkateshwar Reddy wishes CM Revanth Reddy
Democratic rule has come in Telangana: Guntuka Venkateshwar Reddy wishes CM Revanth Reddy
Spread the love

హైదరాబాద్, డిసెంబర్ 10 : తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటికి వెంటనే శ్రీకారం చుట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజల హృదయాలను గెలుచుకున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఎన్.ఆర్.ఐ గుంటుక వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న వెంకటేశ్వర్ రెడ్డి గతంలో తెలంగాణలో కాంగ్రెస్ నాయకుడిగా పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూనే, ఐఎన్ టీయూసీలో చురుకైన పాత్రని పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ లో నూతనోత్సాహం తీసుకొచ్చిన రేవంత్‌ రెడ్డికి ఈ సందర్బంగా ఆయన శుభాకాంక్షలు అందజేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం; ఆరోగ్యశ్రీ పథకంలో ప్రస్తుతం రూ.5 లక్షలు ఉన్న బీమా పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం వంటివి ప్రజలకు ఎంతో మేలును చేకూరుస్తాయని ఆయన అన్నారు. ప్రజల డబ్బుతో నిర్మితమైనా ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్‌ను కొత్త ప్రభుత్వంలో ‘జ్యోతిరావ్‌ పూలే ప్రజాభవన్‌’గా మార్చి తిరుగులేని సీఎంగా ప్రజల్లో నిలిచిపోయారని, తాము అధికారంలోకి వస్తే.. ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి స్వేచ్ఛనిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ఆ హామీని నిలబెట్టుకుంటూ ప్రజాదర్బార్‌ నిర్వహించడం గర్వించతగ్గ విషయమని.. అది ఆయనకు మాత్రమే చెల్లిందన్నారు. తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకురావడానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజాభవన్‌ ఎదుట పోటెత్తిన ప్రజానీకాన్ని చూస్తే.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజల్లో ఏ మేరకు నాటుకుపోయారో ఇట్టే అర్థమవుతోందన్నారు. ‘కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ తొలి ప్రజాదర్బార్‌ సాగింది. జనం నుంచి ఎదిగి.. ఆ జనం గుండె చప్పుడు విని.. వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించిన తృప్తి ఏముంటుంది?’ అని ప్రజాదర్బారులో వినతులు స్వీకరించిన ఫొటోలను సీఎం రేవంత్‌ ఎక్స్‌లో షేర్‌ చేస్తూ రాసుకొచ్చారు. ‘‘పాలనను ప్రజలకు చేరువ చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. పేదల కష్టాలు విని, పరిష్కారమార్గం చూపడమే ప్రజానాయకుడుగా నా బాధ్యత. ఆ బాధ్యతలో భాగమే ఈ ప్రజా దర్బార్‌’’ అని మరో పోస్టులో సీఎం పేర్కొనడంతో ప్రజల్లో కలిగిన ఆనందం అంతాఇంతా కాదన్నారు. తెలంగాణలో నిరంకుశ పాలన పోయిందని, ప్రజాస్వామ్య పాలన వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు గాంధీభవన్ సాక్షిగా ఓ దివ్యాంగురాలు రజనీకి ఇచ్చిన హామీని అమలు చేసి తన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నారు. ఎల్బీ స్టేడియంలో సీఎంగా బాధ్యతలు చేపట్టగానే లక్షలాది ప్రజల సాక్షిగా రజనీకి ఉద్యోగం ఇస్తూ రేవంత్‌రెడ్డి తన హామీని నెరవేర్చారు. స్టేజీపైనే రజనీకి ఉద్యోగ పత్రాలను అందజేశారు. ముందుగా ఆరు గ్యారెంటీలపై రేవంత్‌రెడ్డి తొలి సంతకం చేయగా… అనంతరం రజనీకి ప్రభుత్వోద్యోగం ఇస్తూ రెండో సంతకం చేశారు. ఇలా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం ధర్నా చౌక్‌ను నిషేధించిన తర్వాత దానిని తెరిపించడానికి అనేక పోరాటాలలో భాగస్వాములైన రేవంత్‌రెడ్డికి ఇందిరాపార్కు ధర్నాచౌక్‌తో అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ జరిగిన అనేక ఆందోళనల్లో ఆయన పాల్గొన్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతులు, నిరుద్యోగుల సమస్య, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ధర్నాలు చేసి నిరసన వ్యక్తం చేయడంలో కీలక పాత్ర పోషించారు. చలో సెక్రటేరియట్‌, చలో అంసెబ్లీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ప్రజల మనిషి రేవంత్‌రెడ్డి అని గుంటుక పేర్కొన్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి అహర్నిశలు నిదురలేని రాత్రులు గడిపిన రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారన్నారు. రేవంత్ రెడ్డి సాధించిన ఈ ఘనత వెనక ఎంతో శ్రమ, పట్టుదల, కృషి ఉందని.. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో చోటుచేసుకున్న మజిలీలని గుంటుక వెంకటేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల మొహాలలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యమని చెప్పే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. చెప్పిన మాట ప్రకారమే అడుగులు వేస్తూ ముందుకు కదులుతున్నారని.. కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి దిశగా పయనిస్తోందన్న గట్టి నమ్మకాన్ని వెంకటేశ్వర్ రెడ్డి వ్యక్తం చేశారు.