విలక్షణ నటుడు ధర్మేంద్ర మృతి

Veteran actor Dharmendra passes away
Veteran actor Dharmendra passes away
Spread the love

భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర సింగ్ డియోల్ (89) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఇవాళ సోమవారం తుదిశ్వాస విడిచినట్లు జాతీయ మీడియా వర్గాలు ధృవీకరించాయి. ధర్మేంద్ర మరణ వార్త బాలీవుడ్‌ను, దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తన సుదీర్ఘ కెరీర్‌లో 300కు పైగా చిత్రాల్లో నటించిన ధర్మేంద్ర 1960లలో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన కేవలం నటుడిగానే కాక, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా కూడా రాణించాడు. ధర్మేంద్ర రొమాంటిక్ హీరోగా, యాక్షన్ స్టార్‌గా, కామెడీ పాత్రల్లోనూ అద్భుతమైన నటనను ప్రదర్శించి, అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన కెరీర్‌లో చెప్పుకోదగ్గ మైలురాయి సినిమా 1975లో వచ్చిన ‘షోలే’. ఈ ఐకానిక్ సినిమాలో ఆయన పోషించిన వీరు పాత్ర చిరస్మరణీయమైనది. దీంతో పాటు ‘ఫూల్ ఔర్ పత్తర్’, ‘మేరా గావ్ మేరా దేశ్’, ‘యమ్‌లా పగ్లా దీవానా’ సిరీస్ వంటి అనేక విజయవంతమైన సినిమాల్లో ఆయన నటించారు. ఆయన నేచురల్ యాక్టింగ్, ఆకర్షణీయమైన రూపం, ఉద్వేగభరితమైన నటన ఆయనను దశాబ్దాలుగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిపాయి. భారతీయ సినీ చరిత్రలో ఆయన పోషించిన పాత్రలు, సాధించిన విజయాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఆయనకు అభిమానులు ప్రేమగా ఇచ్చిన నిక్‌నేమ్ ‘బాలీవుడ్ హీ-మ్యాన్’. ఈ పేరు వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా? ధర్మేంద్ర ‘హీ-మ్యాన్’ అనే నిక్‌నేమ్ రావడం వెనుక ఆయనకున్న కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి.. మస్క్యులర్ బాడీ మరియు రగ్గుడ్ లుక్స్: 1960ల, 70ల నాటి బాలీవుడ్ నటులలో ధర్మేంద్ర బాడీ ప్రత్యేకంగా ఉండేది. ఆయన మస్క్యులర్ బాడీ (కండలు తిరిగిన శరీరం), పంజాబీ మూలాలున్న ఆయన రగ్గుడ్ లుక్స్ కారణంగా ఆయనకు ఈ పవర్ఫుల్ పేరు వచ్చింది. ఆ కాలంలో భారతీయ తెరపై పూర్తి స్థాయి యాక్షన్ స్టార్‌గా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. 1960ల మధ్య నుండి 1970ల వరకు ధర్మేంద్ర గారు ఎక్కువగా యాక్షన్ పాత్రలలో నటించారు. ‘షోలే’, ‘ధరమ్ వీర్’, ‘మేరా గావ్ మేరా దేశ్’ వంటి సినిమాల్లో ఆయన పోషించిన సాహసోపేతమైన, ధైర్యవంతులైన పాత్రలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ పాత్రల ద్వారా ఆయన శక్తిమంతుడైన హీరోగా ప్రేక్షకులలో క్రేజ్ సంపాదించుకున్నాడు. దాంతో ఫ్యాన్స్ ఆయనకు హీ మ్యాన్ అనే నిక్‌నేమ్ పెట్టారు. ధర్మేంద్ర కేవలం యాక్షన్ హీరోగానే కాకుండా అనేక జానర్లలో తన ప్రతిభను నిరూపించుకున్నారు. యాక్షన్, రొమాన్స్, కామెడీ వంటి విభిన్న జానర్లలో ఆయన అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా హేమ మాలినితో ఆయన రొమాంటిక్ కెమిస్ట్రీ అద్భుతంగా పండేది. ఇక ‘చాచు మామా’ వంటి సినిమాలతో ఆయన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఆయన దాదాపు 300కు పైగా చిత్రాలలో నటించారు. భారతీయ సినీ చరిత్రలో ఈ మైలు రాయిని అతి కొద్ది మంది నటులు మాత్రమే అందుకున్నారు. దశాబ్దాలుగా ఆయన నటన కొనసాగుతూనే వచ్చింది. ధర్మేంద్ర చివరిగా నటించిన సినిమా ‘ఇక్కిస్’ త్వరలో విడుదల కానుంది. యుద్ధ నేపథ్యంతో కూడిన ఈ సినిమాలో ఆయన ఏ పాత్ర పోషించారు.. ఆయన నటన ఎలా ఉంటుందో చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ధర్మేంద్ర మరణం బాలీవుడ్‌ పరిశ్రమను శోక సంధ్రంలో ముంచేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ధర్మేంద్ర జీ మరణంతో భారతీయ సినిమాలో ఒక యుగం ముగిసిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌‌లో పోస్ట్ చేశారు. ధర్మేంద్ర చివరి చూపు కోసం బాలీవుడ్ మొత్తం తరలి వచ్చింది. అమితాబ్, అభిషేక్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, సంజయ్ దత్‌లు శ్మశానానికి చేరుకున్నారు. ధర్మేంద్ర అంత్యక్రియల్లో పాల్గొన్నారు