జర్నలిస్ట్ ప్రభు రాసిన “శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు” పుస్తకాన్ని ఆవిష్కరించిన మెగాస్టార్

shunyam nunchi shikharagralavaraku book relese by megastar chiranjivi
shunyam nunchi shikharagralavaraku book relese by megastar chiranjivi
Spread the love

24 మంది సినీ ప్రముఖుల జీవిత చరిత్రలను ఆవిష్కరిస్తూ జర్నలిస్ట్‌ ప్రభు రాసిన శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ శుక్రవారం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జర్నలిస్టు ప్రభు జన్మదిన వేడుకలను నిర్వహించారు. కుటుంబసభ్యులు, చిరంజీవితో కలిసి జర్నలిస్టు ప్రభు కేక్ కట్ చేసి పుట్టినరోజుని సెలబ్రేట్‌ చేసుకున్నారు. తర్వాత మెగాస్టార్‌ చేతులు మీదుగా “శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు” పుస్తకాన్ని ఆవిష్కరించారు. దాసరి నారాయణరావు, కృష్ణ, కృష్ణంరాజు, విజయనిర్మల, వడ్డే రమేశ్‌, కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్‌, సి.కల్యాణ్‌, తమ్మారెడ్డి భరద్వాజ వంటి వారి జీవిత చరిత్రలను జర్నలిస్ట్ ప్రభు ఈ పుస్తకంలో ఆవిష్కరించారు.
మెగాస్టార్‌ చేతుల మీదుగా ఆవిష్కరించిన తొలికాపీకి వేలంపాట నిర్వహించగా.. రవి పనస రూ.4 లక్షలకు ఆ పుస్తకాన్ని దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో మురళీ మోహన్, గిరిబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, శివాజీ రాజా, రేలంగి నరసింహారావు, డైరెక్టర్‌ పీఎన్‌ రామచంద్రారావు, సీనియర్ యాక్టర్‌ హేమచందర్‌, ఉత్తేజ్, దాసరి అరుణ్ కుమార్, సినిక్స్‌ గ్రూప్ అధినేత చుక్కపల్లి రమేశ్‌ తో పాటు.. ఇతర పాత్రికేయులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. మెగాస్టార్‌ చిరంజీవి గురించి రాసిన ఒక ఆర్టికల్‌కి ఆయన అభినందిస్తూ తిరిగి ఉత్తరం రాసిన విషయాన్ని వెల్లడించారు. ఆ ఉత్తరం కారణంగా ఆయన జర్నలిజంలో ఎలా ముందుకు సాగారో చెప్పుకొచ్చారు. తాను ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం మెగాస్టార్‌ అంటూ వ్యాఖ్యానించారు.
ఇక మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ.. “ఈరోజు ఇలా నా కుటుంబాన్ని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నో భాషలతో పోల్చుకుంటే తెలుగు సినిమా జర్నలిజంలో ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది. ఎప్పుడూ తెలుగు సినిమా జర్నలిజం విషయంలో ఎలాంటి కంప్లైంట్స్‌ రాలేదు. ఆ విషయంలో మాత్రం జర్నలిస్టులు అందరికీ హ్యాట్సాఫ్‌ చెప్పాలి. “శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు” అనే హెడ్డింగ్‌తో పుస్తకం రావడం అనేది ఇప్పుడు అవసరం. మా ఇంట్లోనే నా మనవళ్లు, మనవరాళ్లు ఎప్పుడూ రామ్ చరణ్‌, బన్నీ, తేజ్‌, వైష్ణవ్‌ వీళ్లే హీరోలు అన్నట్లు.. వాళ్ల పాటలే పెట్టమంటూ ఉంటారు. సరదాగా నాకు ఎక్కడో కడుపు మండిపోతూ ఉంటుంది. మనకి ఎన్నో హిట్‌ సాంగ్స్‌ ఉన్నాయి. అవి అడగరు ఎందుకు అనుకుంటూ ఉంటాను. నేను ఎవరినో, ఏమిటో చెప్పుకోవాల్సిన పరిస్థితి నాకే ఏర్పడింది. ఓరోజు నా బెస్ట్ నంబర్స్ మొత్తం చూపించాను. ఇప్పుడు వాళ్లు “గాడ్‌ ఫాదర్‌” మూవీ నాలుగుసార్లు చూశారు. అలా మన ఇండస్ట్రీలో ఉన్న గొప్పవాళ్ల గురించి ఇప్పటి జనరేషన్‌కి తెలిసేలా ఓ పుస్తకం రాయాలని ప్రభు పూనుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను” అంటూ మెగాస్టార్‌ చిరంజీవి వ్యాఖ్యానించారు.