ఉగాదికి గద్దర్ తెలంగాణ సినిమా పురస్కారాలు : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

Ugadiki Gaddar Telangana Film Awards : Deputy Chief Minister Mallu Bhatti Vikramarka
Spread the love

– ప్రతి యేటా అధికారికంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు
– కళలను ప్రోత్సహిస్తున్న ప్రజా ప్రభుత్వం

కళలను కళాకారులను చిత్తశుద్ధితో ప్రోత్సహిస్తున్న ప్రజా ప్రభుత్వం మనదని, ఇకపై ప్రతి యేటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భక్త రామదాసు గా పిలవబడే కంచర్ల గోపన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. రానున్న ఉగాది పండుగ రోజున గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల ప్రదానోత్సవం జరగనున్నదని ఆయన వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఎల్.బి.ఇండోర్ స్టేడియంలో శ్రీ భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బిసి సంక్షేమం రోడ్లు భవనాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క పాల్గొని జ్యోతి ప్రజ్వాలనం చేసి ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు.
తమిళనాడు తిరువయ్యుర్ లో యేటా జరిగే త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాల మాదిరిగా ఇక ప్రతి ఏటా తెలంగాణలో వాగ్గేయకారుడు భక్త రామదాసు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని మల్లు భట్టి విక్రమార్క హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, కళారంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఆయన అన్నారు. సినిమా కళాకారులకు పురస్కారాలు ఇచ్చినట్లుగా సంగీత నాటక కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కళలను ముందుకు తీసుకెళ్లే వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రజా ప్రభుత్వం కల్పిస్తున్నదని చెప్పారు. భక్త రామదాసు జన్మించిన జిల్లా నుంచి తాను ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. తానీషా పాలనలో తహసీల్దార్ గా వున్న కంచర్ల గోపన్న ప్రజల నుంచి వసూలు చేసిన శిస్తు సొమ్ములను పాలకులకు పంపించకుండా శిధిలావస్థలో వున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం పునరుద్దరించారని గుర్తు చేశారు. తానీషా ప్రభువు ఆగ్రహానికి గురై భక్త రామదాసు గోల్కొండ కోటలో ఖైదీగా మారిన చరిత్ర మనకు తెలిసిందేనని అన్నారు. ఎన్ని చిత్రహింసలు పెట్టినప్పటికి తన శ్రీరామ భక్తిని కోల్పోకుండా కీర్తనలు గానం చేసిన గొప్ప భక్తిమయుడు భక్త రామదాసు అని కీర్తించారు. భక్త రామదాసును స్ఫూర్తిగా తీసుకుని సంగీత విద్వాంసులుగా, వాగ్గేయకారులుగా ఎదగాలని మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. భక్తిరస వాగ్గేయకార సంకీర్తనల ప్రచారం ద్వారా సమాజంలో సేవాభావం పెంపొందుతుందని, భవిష్యత్ తరాలకు అందించాలని ఆయన కోరారు.
గత దశాబ్ద కాలపు ప్రభుత్వంలో కళాకారులకు ప్రోత్సాహమే లేదని, ప్రతి యేటా ఇవ్వాల్సిన నంది అవార్డులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంగా గద్దర్ అవార్డులను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. అలేఖ్య పుంజాల విజ్ఞప్తి మేరకు నాటక రంగంలో రాణిస్తున్న కళాకారులను కూడా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. నంది నాటకోత్సవాల మాదిరిగా ప్రతి యేటా రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరచిన కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భగవంతుడు అందరికి కళా ప్రతిభ ఇవ్వలేదని, కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే ఆ అవకాశం ఇచ్చారని, భగవంతుడు ఇచ్చిన కళలను ప్రజలకు పంచి సమాజ వికాసానికి దోహదపడాలని కోరారు. మంత్రి ధనసరి సీతక్క మాట్లాడుతూ కళాకారులు ఆనందంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా సస్య శ్యామలంగా ఉంటుందని, కళాకారులకు ప్రభుత్వం నుంచి మెండుగా ఆశీస్సులు ఉన్నాయని కళాకారులు అందరికి ఈ విషయం చెప్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను పంపించినట్లు చెప్పారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ఆచార్య డా. అలేఖ్య పుంజాల మాట్లాడుతూ అన్ని జిల్లాల నుంచి 600 మంది సంగీత కళాకారులు ఈ ఉత్సవంలో పాల్గొన్నట్లు తెలిపారు. మే 4న త్యాగరాజ స్వామి జయంతిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తున్నదని చెప్పారు.
ప్రముఖ సంగీత విద్వాంసులు పద్మశ్రీ డా. యెల్లా వెంకటేశ్వరరావు, పద్మశ్రీ డా. శోభారాజు, పద్మశ్రీ డి. ఉమా మహేశ్వరి, కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీతలు హైదరాబాద్ బ్రదర్స్ డా. రాఘవాచార్యులు, హైదరాబాద్ సిస్టర్స్ హరిప్రియ, కళాకృష్ణ, కోవెల శాంత, ప్రేమ రామమూర్తి, డా.జయప్రద, శేషులత, మంథా శ్రీనివాస్, నేలకొండపల్లి నుంచి భక్త రామదాసు వారసుడు వెంకట రమణ తదితరులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘనంగా సత్కరించారు. 10 గంటల పాటు మొత్తం 26 బృందాలు రామదాసు కీర్తనలు ఆలపించి భక్తిభావంలో ముంచెత్తారు. శ్రీరామ నామంతో ఎల్బి స్టేడియం హోరెత్తింది. సాంస్కృతిక శాఖ కార్యదర్శి స్మిత సభర్వాల్, సాంస్కృతిక సారధి అధ్యక్షురాలు గుమ్మడి వెన్నెల తెలంగాణ సంగీత నాటక అకాడమీ కార్యదర్శి బి. మనోహర్, ఆర్. వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ట్యాంక్ బండ్ పై వున్న భక్త రామదాసు విగ్రహానికి సంగీత కళాకారులు పూలమాలలు సమర్పించి వూరేగింపుగా ఎల్ బి స్టేడియం కు చేరుకున్నారు. నవరత్న రామదాసు కీర్తనల గాన గోష్టితో ఆరంభమై శ్రీరామ సంకీర్తనలు గానం చేసి భక్తి రసానందలోకంలో ముంచెత్తారు.

Related posts

Leave a Comment