అట్టహాసంగా 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

69th National Film Awards at Attahasan
Spread the love

* రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల పంపిణీ
* జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం వైభవంగా సాగింది. ఎన్నడూ లేని స్థాయిలో టాలీవుడ్‌ తారలు తళకులీనారు. ఈ ఏడాది ప్రకటించిన నేషనల్‌ అవార్డుల్లో టాలీవుడ్‌కు వివిధ విభాగాల్లో అవార్డులు లభించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల చరిత్రలో తొలిసారి.. ఒక టాలీవుడ్‌ హీరోకు ఉత్తమ హీరో అవార్డు లభించడం విశేషం. ‘పుష్ప: ది రూల్‌’ చిత్రంలో అల్లు అర్జున్‌ నటనకు ఫిదా అయిన జ్యూరీ అతడిని ఉత్తమ కథానాయుకుడిగా ఎంపిక చేశారు. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్‌ ఈ అవార్డును అందుకున్నాడు. ‘పుష్ప’ సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా రాక్‌ స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ అవార్డు అందుకున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ’ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి కూడా అవార్డుల వర్షం కురిసింది. మొత్తం ఆరు అవార్డులతో.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తన సత్తా చాటింది. ఎం.ఎం కీరవాణి ఈ సినిమాకు గాను ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఆయన తనయుడు కాల భైరవకు ‘కొమురం భీముడో…’ సినిమాకు గాను ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డు అందుకున్నాడు. తండ్రి కుమారులు ఇద్దరూ ఒకే రోజు ఒకే వేదికపై పురస్కారాలు అందుకోవడం గమనార్హం. వారితోపాటు దర్శకుడు రాజమౌళి కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపికైన ‘ఉప్పెన’ చిత్రం నుంచి దర్శకుడు బుచ్చిబాబు అవార్డు అందుకున్నాడు. ‘కొండపొలం’లో ధమ్‌ ధమ్‌ ధమ్‌… పాటకు ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్‌ పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ నటిగా 69వ జాతీయ పురస్కారాల్లో ఇద్దరు హిందీ కథానాయికలు నిలిచారు. ‘గంగూబాయి కథియావాడి’ చిత్రంలో నటనకు గాను ఆలియా భట్‌, ‘మిమి’లో నటనకు కృతి సనన్‌ పురస్కారం కైవసం చేసుకున్నారు. ‘మిమి’ చిత్రంలో నటనకు పంకజ్‌ కపూర్‌ ఉత్తమ సహాయ నటుడిగా నిలిచారు. తమిళ కథానాయకుడు, భాషలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న మాధవన్‌ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన ‘రాకెట్రి’ సినిమా ఉత్తమ జాతీయ సినిమాగా నిలిచింది. సంచలన విజయం సాధించిన ‘ది కశ్మీర్‌ఫైల్స్’ సినిమా ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా నిలిచింది. జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం మొదలైంది. మన దేశ రాజధాని ఢిల్లీలో పురస్కార విజేతల సందడి మొదలైంది. ముఖ్యంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ సగర్వంగా తలెత్తి నిలబడింది. నేషనల్‌ లైవ్‌ సాక్షిగా మన మాతృభాష తెలుగులో సినీ ప్రముఖులు మాట్లాడటం ఆకట్టుకుంది. తనకు అవార్డు రావడం చాలా అంటే చాలా సంతోషంగా ఉందని జాతీయ మీడియాతో అల్లు అర్జున్‌ చెప్పారు. కమర్షియల్‌ సినిమాకు అవార్డు రావడం వ్యక్తిగతంగా తనకు డబుల్‌ అచీవ్‌మెంట్‌ అని బన్నీ పేరొన్నారు. ’పుష్ప’ సినిమాలో సిగ్నేచర్‌ డైలాగ్‌ చెప్పమని ఆయన్ను అడగ్గా… ‘నా మాతృభాషలో చెప్పడం నాకు కంఫర్టబుల్‌గా ఉంటుంది‘ అంటూ ‘తగ్గేదే లే‘ అని చెప్పారు. ‘పుష్ప’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. ఆ సంస్థ నిర్మించిన ‘ఉప్పెన’ ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు అందుకుంది. దర్శకుడు సానా బుచ్చిబాబుతో పాటు, నిర్మాత నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ సైతం అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లారు. జాతీయ మీడియాలో బుచ్చి బాబు కూడా తెలుగులో మాట్లాడారు. ‘పుష్ప’ సినిమాకు గాను అల్లు అర్జున్‌, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌… ఇద్దరికీ అవార్డులు రాగా, ‘ఆర్‌ఆర్‌ఆర్‌ : రౌద్రం రణం రుధిరం’ సినిమాకు ఆరు అవార్డులు వచ్చాయి. ఆ సినిమా దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి సైతం ఢిల్లీ వెళ్లారు. దర్శక ధీరుడు, బన్నీతో పాటు నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ సెల్ఫీ దిగారు.

Related posts

Leave a Comment