చిన్న నిర్మాతలే పరిశ్రమకు పెద్ద దిక్కు : ‘మీట్‌ ది ప్రెస్‌’లో చదలవాడ శ్రీనివాసరావు

Small producers are the big direction for the industry: Chadalawada Srinivasa Rao on 'Meet the Press'
Spread the love

* తెలుగు రాష్ట్రాల సీఎంలు చిన్న నిర్మాతలతో చర్చలు జరపాలి
* ఇండస్ట్రీకి చిన్న నిర్మాతలు చాలా ముఖ్యం

ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సారధ్యంలో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుతో ఆదివారం సోమాజి గూడ ప్రెస్‌ క్లబ్‌లో ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్య క్రమం నిర్వహించారు. చిత్ర పరిశ్రమలోని చిన్న సినిమాల స్థితిగతుల అంశం మీద ఈ కార్యక్రమం జరిగింది. అతిధులుగా ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్, దర్శకులు అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఎంతో మంది సీనియర్‌ జర్నలిస్టుల సమక్షంలో ‘మీట్‌ ది ప్రెస్‌’ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రాసిన ‘శూన్యం నుండి శిఖరాగ్రం వరకు’ పుస్తకం గద్దర్ అవార్డ్ సాధించిన సందర్భంగా ఆయనకు శ్రీనివాసరావు గారి చేతుల మీదగా చిరు సత్కారాభినందన జరిగింది. ఆ తర్వాత సీనియర్ పాత్రికేయులు ఉమామహేశ్వరరావు, మోహన్ గోటేటి, బాల్ రెడ్డి, ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు పాటు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల జె.వి ప్రసాదరావు, సెక్రటరీ సురేష్‌కొండేటి కలిసి ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుకి ఘన సత్కార కార్యక్రమం జరిపి సన్మాన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ వైస్ ప్రెసిడెంట్స్ జనార్దన్ రెడ్డి, ఎం.డి అబ్దుల్, కోశాధికారి భరద్వాజ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాస్‌ మాట్లాడుతూ… ఈ రోజు ఆదివారం పత్రికా విలేఖరులు ఉదయం తొమ్మిది, పది గంటలకే రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ రోజు మన మిత్రుడు, మన పుత్రుడు మన స్నేహితుడు మన శ్రేయోభిలాషి మన ప్రభుకి గద్దర్‌ అవార్డు రావడం యావత్‌ సినీ పాత్రికేయులందరికీ కూడా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే రైట్‌ పర్సన్‌కి ఈ అవార్డు వచ్చింది. రైట్‌ పర్సన్‌ అని ఎందుకన్నానంటే… నేను మద్రాసు వెళ్ళిన కొత్తల్లో ఉమా, స్వర్గీయ మిక్కిలినేని జగదీష్‌బాబు, బి.ఎ.రాజు, బి.ఎ. జయ, పసుపులేటిరామారావు, ట్రేడ్‌గైడ్‌ వెంకటేశ్వరావు, రెడ్డి వీరంతా ఉండేవారు. ఉమా పర్సనల్‌గా నన్ను తమ్ముడు అని పిలిచేవారు. ఆయన నాతో ఎన్నో మంచిమంచి పనులు చేయించుకున్నారు. అందుచేత ప్రభుకి నాకు ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఈ మధ్యకాలంలో ప్రభు, నేను ఇంకా ఇంకా దగ్గరయ్యాం. దానికి కారణం జర్నలిస్టులో ఎవరికి ఎటువంటి పని ఉన్నా కూడా తలలో నాలుకలా తయారయ్యి ప్రతిఒక్కరికీ చేస్తాడు ప్రభు. దాసరినారాయణరావుగారు ఉన్నప్పుడు ఇండస్ట్రీలో కొంతమందికి చేశారు. కానీ ప్రభు ఏ జర్నలిస్టుకి కష్టమొచ్చినా ఎంత అర్ధరాత్రి అయినా సరే ప్రభు ఉన్నాడు అనే స్టేజీకి భగవంతుడు అతడిని తీసుకెళ్ళాడు. ఇటువంటి ప్రభు మనందరి ఆయురారోగ్యాలు పోసుకుని నలుగురికి ఇంకా మంచి చేయాలని, గద్దర్‌ అవార్డు అందుకున్నందుకు అందరి తరపున మరొక్కసారి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు. ఇక మీరేమైతే ప్రశ్నలు అడుగుతారో నిస్సదేహంగా అడగండి వాటన్నిటికీ కూడా నేను జవాబులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు.
ప్రశ్న – జవాబులు


చిన్న సినిమాకి ప్రభుత్వ పరంగా ఎలాంటి సపోర్ట్‌ ఉండాలంటారు?… డిజిటల్‌ కంటెంట్‌ ప్రొవైడర్స్‌ ఇతర రాష్ట్రాలలో ఒక సినిమాకి మూడు నుంచి నాలుగు వేల వరకు వసూలు చేస్తే మన వద్ద వచ్చేసి 10వేల వరకు వసూలు చేస్తున్నారు క్యూబ్‌, యుఎఫ్‌ఓవారు. ఇది ఒక 100 థియేటర్స్‌లో ఒక చిన్న నిర్మాత సినిమాను విడుదల చేస్తే అక్కడే 10లక్షలు పోతున్నాయి దీని పై మీ అభిప్రాయం?
-చిన్న సినిమాలకు ముఖ్యంగా ప్రభుత్వ సపోర్ట్‌కన్నా కూడా మా ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్‌ అనేది చాలా అవసరం. అంతేకాక మా ఫిలిం ఛాంబర్‌ సపోర్ట్‌ కూడా చాలా అవసరం. ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సపోర్ట్‌ చాలా అవసరం ఎందుకంటే…చిన్న సినిమా అనేది ఎదుగుదలకి ఒక మొక్కలాంటిది. ఎంత పెద్ద హిట్‌ అవ్వాలన్నాకూడా చెట్టుకి విత్తనం ఎంత అవసరమో చిన్న సినిమా కూడా ఇండస్ట్రీకి అంతే అవసరం. చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌, విజయ్‌దేవరకొండ నుంచి ప్రతీ ఒక్కరూ కూడా చిన్న సినిమా నుంచే పైకి వచ్చారు. ఆఖరికి రాజమౌళి కూడా డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, కూడా రాఘవేంద్రరావు కూడా, దాసరినారాయణరావుగారు కూడా ‘స్వర్గం నరకం’ సినిమా. అందుచేత చిన్న సినిమాలను బ్రతికిస్తే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. అందుచేత ప్రభుత్వం కంటే కూడా అవగాహనతో ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ కూడా మంచి సినిమాలు తీసే నిర్మాతల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించాలి. గతంలో 20,30ఏళ్ళ క్రితం చంద్రబాబుగారి హయాంలో చిన్న సినిమాలకు సబ్సిడీ ఇచ్చేవారు. ఒక సినిమాతో సక్సెస్‌ వస్తుందని ఎప్పుడూ నిర్మాత నమ్మకూడదు. అనుభవంతో ఉంటే ఏ నిర్మాత అయినా కూడా మంచి సినిమా తీయగలడు. రెండు గవర్నమెంట్లు కలిసి ఒక కమిటీ వేసుకుని చిన్న నిర్మాతలను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.

ఇటీవల ఫిలిం ఛాంబర్‌ ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఏ సినిమా అయినా సరే థియేటర్‌ ఎనిమిది వారాల తరువాతే ఓటీటీకి ఇవ్వాలని తెలిసింది? ఈ ప్రభావం చిన్న సినిమాల పైన ఎంత వరకు పడుతుందని మీరు అనుకుంటున్నారు?
-చిన్న సినిమా అనేది తీయడం వరకు తీస్తున్నాం కానీ దాన్ని బ్రతికించడం కష్టం అయిపోయింది. ఓటీటీ కాదు థియేటర్లలో రిలీజ్‌ చేయడం చాలా కష్టమయిపోయింది. సినిమా ప్రాడక్ట్‌ వరకు మనం తయారు చేయగలం. కానీ అవి విడుదలవ్వాలంటే థియేటర్లు గతంలో లాగా ఉండడం లేదు. ఒకప్పుడు థియేటర్‌కు జనం ఎక్కువగా వచ్చేవారు. ఇప్పుడు చాలా సినిమాలు ఉండడం వల్ల ఆడియన్స్‌ తగ్గిపోయారు. చిన్న సినిమాకి పర్సంటేజి, రేట్లు అన్నీ చూసుకుంటే ముఖ్యంగా విపరీతమైన తినుబండారాల రేట్ల వలన థియేటర్‌కి ప్రేక్షకులు రాకపోవడం వల్ల ముఖ్యంగా చిన్న నిర్మాతలు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఎంటైర్‌ విధానాన్ని మార్చాల్సిన అవసరం చాలా ఉంది. ఖచ్చితంగా చిన్న నిర్మాతల పరిస్థితి ఇండస్ట్రీలో బాలేదు అది సత్యం.

గతంలో మీరు ఒక మాట అన్నారు.. నిర్మాతలకు అసలు వాల్యూ లేదు…డైరెక్టర్‌కానీ, హీరోలు కానీ ప్రొడ్యూసర్‌కి వాల్యూ ఇవ్వడం లేదు అని. ఎందుకని ప్రొడ్యూసర్‌ ఒక క్యాష్‌బ్యాంక్‌లాగా అయిపోయారు?
-ఎందుకు అవుతారు.. నేను అయ్యానా? సరైన నిర్మాత ఎవరికైనా ఎందుకు లొంగుతారు. ఎప్పుడూ ఎదుటివారిది తప్పు ఉండదు. మనదే తప్పు ఉంటుంది. నేను కూడా పెద్ద సినిమాలు తీయగలను కానీ ఎందుకు తీయను. గతంలో నేను నాగేశ్వరావుగారితో, ఎన్టీఆర్‌తో, శోభనబాబుతో, కృష్ణతో, కృష్ణంరాజుతో పెద్ద సినిమాలే తీశాను కదా. ఇప్పుడు ఎందుకు తీయడం లేదు. ఆ హీరోలు ఆ రోజుల్లో కాస్ట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ ఆ సిన్సియారిటీ ఆ హానెస్టీ ఈరోజు లేదు కాబట్టి నేను చిన్న సినిమాలు నాకు తగ్గవి తీస్తున్నాను. నిర్మాత విలువ తగ్గించడం లేదు.

చిత్ర పరిశ్రమలో 24 క్రాఫ్ట్ లు ఉన్నాయి, 24 శాఖలు ఉన్నాయి. కానీ ఏ శాఖకు ఉండాల్సిన అసోసియేషన్‌ ఆ శాఖకు ఉంది. డైరెక్టర్లకు, ఆర్టిస్టులకు, కెమెరామెన్లకు కానీ అలాగే నిర్మాతలకు ప్రొడ్యూసర్ కౌన్సిల్‌ ఉంది. ఏ అసోసియేషన్‌ కూడా దాంట్లో నుంచి పక్కకు వెళ్ళి వేరు కుంపటి పెట్టుకోలేదు. కానీ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌నుంచి కొంత మంది నిర్మాతలు గిల్డ్‌ అనేది పెట్టుకున్నారు. గిల్డ్‌ ప్రయోజనాలకి, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ యొక్క ప్రయోజనాలకి విభేదాలు ఏర్పడుతున్నాయి. ఇది చాలా అగాధాన్ని సృష్టిస్తున్నాయి. ఇండస్ట్రీలో సమస్యలు అనగానే పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలే తప్ప చిన్న సినిమాలను అడ్రస్‌ చేయడానికి లేకుండా పోయింది. అలా గిల్డ్‌ వేరుపడడానికి గల పరిస్థితుల గురించి వివరించండి?
-రెండు కుటుంబాలుంటే అందులో ఒకటి పేద కుటుంబం, ఒకటి రిచ్‌ కుటుంబం అనుకుందాం. అందులో పేద కుటుంబం అందరూ కలిసి కట్టుగా పని చేస్తున్నారు. పేద కుటుంబంలో తండ్రి సంపాదించాక అందులో ఇద్దరు మేం బాగా సంపాదించాం అని బయటకు వెళ్ళిపోతే ఎలాగో మా సినిమా ఇండస్ట్రీ కూడా అలాగే తయారయింది. ఎవరైతే ఇండస్ట్రీ ద్వారా పెరుగుతున్నారో వాళ్ళు నలుగురు ఒకటయి కేవలం బిజినెస్‌తో అంటే భగవంతుడు గాలి, నీరు ఇచ్చారు కాబట్టి మనమందరం పీల్చుకుంటున్నాము. లేదంటే వీళ్ళ చేతుల్లో ఉంటే దాన్ని కూడా కొని మేము నలుగురమే బ్రతకాలి అంటారు ఈ గిల్డ్‌ అనేవారు. గిల్డ్‌ అనేది ఒక విషపురుగు, విషసంస్కృతి. నేను గతంలో కూడా ప్రభుత్వానికి చెప్పాను. మళ్ళీ కూడా చెబుతున్నాను ఈ విష సంస్కృతిని పోషించే సినీ పెద్దలను ప్రభుత్వం ప్రోత్సహించవద్దు. అది సినిమా ఇండస్ట్రీకి దండన. మీకు ఓట్లు వేసి గెలిపించేది మా చిన్న నిర్మాతలు, కార్మికులే కానీ మీరు గెలిచిన అనంతరం పెద్ద నిర్మాతల వెనుక తిరగడం పెద్ద నిర్మాతలతో ఫొటోలు దిగడం ముఖ్యంగా గిల్డ్‌ వారితో కలిసి ఫొటోలు దిగడం అనేది ప్రభుత్వం చేసేది మంచి పద్ధతి కాదు.

చిన్న సినిమాకు మీరు ఇచ్చే నిర్వచనం ఏమిటి? ఎంత బడ్జెట్‌ వరకు ఉంటే అది చిన్న సినిమా అవుతుంది?
-పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా కరెక్టుగా తీస్తే 30రోజులు సరిపోతుంది. ఎం.ఎస్‌. విశ్వనాధ్‌గారుకానీ, విశ్వనాధ్‌గారు కానీ, చక్రవర్తిగారు కానీ మిగతా మ్యూజిక్‌ డైరెక్టర్లు అందరూ కూడా పాటను హాఫ్‌డేలో కంప్లీట్‌ చేశారు. ఒక సినిమాకి ఆరు పాటలుంటే మూడు రోజుల్లో కంప్లీట్‌ అయిపోయాయి. ప్రతి ఒక్కరం ఒక దగ్గరే ఉండి క్వాలిటీగా చేయించుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ అధునాతన సంగీతం వచ్చేసి అసలు డైరెక్టర్‌కి కూడా తెలియదు ఆ పాట ఏది వస్తుందో ఏమిటో ప్రొడ్యూసర్‌కి తెలియదు ఎవరికీ తెలియదు. పాత పద్ధతిలో ఉన్నప్పుడే క్వాలిటీ సాంగ్స్‌ వచ్చేవి. ఎక్కడికి వెళ్ళినా పాత సినిమాల పాటలే వినపడతాయి. కొత్త సినిమాల పాటలు వినపడవు. వీటి వలన క్వాలిటీ తగ్గిపోయింది. సరిగ్గా షూటింగ్‌ సమయాల్ని ప్లాన్‌ చేసుకుంటే బావుంటుంది కానీ లేదంటే కాస్ట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ పెరిగిపోయి సినిమా ఇండస్ట్రీ మంచిది కాదనడం సరికాదు. క్వాలిటీ ప్రాడక్ట్‌ రావాలంటే డిసిప్లయిన్‌గా చేస్తే ఖచ్చితంగా వస్తుంది. చిన్న సినిమాకి నాకు తెలిసి మూడు నుంచి ఐదు కోట్ల వరకు మంచి సినిమాను తీయవచ్చు. మీరు అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల టెన్‌ పర్సెంట్‌ స్క్రీన్‌మీద కనిపిస్తే మిగతా టెన్‌ పర్సెంట్‌ చెత్త బుట్టలో పడిపోతుంది. గతంలో అడవిరాముడు చిత్రం 26రోజుల్లో తీశారు. ఇటీవలే సంక్రాంతికి విడుదలైన చిత్రాలను తీసుకుంటే నాలుగు చిత్రాల్లో ఒకటి చాలా కాస్ట్‌లీ చిత్రం కానీ తక్కువ బడ్జెట్‌లో తీసిన సినిమానే హిట్‌ అయింది. ఈ సందర్భంగా ప్రభు సతీమతి అయిన స్వర్గీయ మాధవిగారి పేరు మీద ఉన్న ట్రస్ట్‌ ద్వారా క్రిటిక్స్‌ అసోసియేషన్‌కి ప్రభు చదలవాడ శ్రీనివాసరావుగారి చేతుల మీదుగా యాభైవేల చెక్కును అందజేశారు.

చిన్న సినిమా ఈ రోజున ఈ పరిస్థితికి రావడానికి కారణం ఇండస్ట్రీనే అని కొంతమంది అనుకుంటున్నారు…మీ అభిప్రాయం?
-ఎవరు తీసినా ఉషాకిరణ్‌మూవీస్‌ వారు ఎలాంటి సినిమాలు తీశారు, ఎల్‌.వి. ప్రసాద్‌గారు ఎలాంటి సినిమాలు తీశారు, రామానాయుడుగారు ఎలాంటి సినిమాలు తీశారు. మంచి మంచి సంస్థలు మనుషులు ఉన్నా లేకున్నా వారసత్వాలు రన్‌ అవుతున్నారు కానీ వారసత్వపు ప్రొడ్యూసర్స్‌ రన్‌ అవ్వడం లేదు. కారణం ఏమిటంటే… అసలు సినిమా ఇండస్ట్రీలో ఖర్చు పెట్టిన డబ్బు వెనక్కి రాదు. గతంలో 90పర్సెంట్‌ వచ్చేది. ఇప్పుడు తగ్గిపోయింది. కారణం ఏమిటంటే డిసిప్లయిన్‌ లేకపోవడం.ప్రొడక్షన్‌ వాల్యూస్‌ మన చేతిలో లేకపోవడం.

గతంలో 2020,23లో ఎన్నో సినిమాలను రిలీజ్‌ కూడా చేశారు మీరు. చిన్న సినిమాలకు థియేటర్లే దొరకడం లేదన్నది పెద్ద సమస్యగా మారింది. అలాంటి పరిస్థితుల్లో నిర్మాత ఏం చేయాలి?
-నేను గతంలో మినీ థియేటర్లను కడదాం అని ప్లాన్‌ చేశాను. ఛాంబర్‌ ద్వారా మినీ థియేటర్స్‌ పాంప్లేట్‌ వేస్తే 100 తీసు కువెళ్ళారు. కానీ మాకు ప్రభుత్వం తరపునుంచి ఎటువంటి సహాయం లేదు. చిన్న థియేటర్ల లైసెన్స్‌ 50 నుంచి 200 వరకు ప్రతీ కమ్యూనిటీలో, ప్రతీ సందులో, ప్రతీ సంస్థలో చిన్న సినిమాల వల్ల వెరైటీ కథలు బయటకు వస్తాయి. బడ్జెట్‌లో తీస్తారు. కాబట్టి మినీ థియేటర్స్‌ వస్తే బావుంటుంది అని నా అభిప్రాయం.

ప్రముఖ సీనియర్‌ జర్నలిస్ట్‌, గద్దర్‌ అవార్డ్‌ గ్రహీత ప్రభు మాట్లాడుతూ…నేడు ఈ కార్యక్రమం ఇంత బాగా కళ కళలాడడానికి ముఖ్యకారణం చదలవాడశ్రీనివాస్‌గారు. ఆయన చూపిన వితరణ ఆయన చూపిన సహృదిత వారి సౌజన్యం, వారి దాతృత్వం ఈ కారణాల వల్ల అందరూ కూడా విచ్చేశారు. ఇక కొంత మంది తమ పనుల ద్వారానో లేక కుదరకో తప్పించి వేరే ఆలోచన ఏమీ లేదని అన్నారు. ఫిల్మి క్రిటిక్స్‌ అసోసియేషన్లో నాకు గతంలో కూడా చాలా చాలా సన్మానాలు జరిగాయి. జీవితంలో మొదటిసారి 1993 ఆగస్టు11న రవీంద్రభారతిలో అప్పటి సీఎం కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్న తొలి సన్మానం మొదలుకొని ఎన్నో వందల అవార్డులు నేటి వరకు ఎన్నో సత్కారాలు జరిగాయి. నన్ను సత్కరించని సాంస్కృతిక సంస్థ లేదు బెస్ట్‌ జర్నలిస్ట్‌ అవార్డుతో. గతంలో నంది అవార్డు వచ్చింది. శంకర్‌దయాల్‌ శర్మ చేతుల మీదుగా రాజీవ్‌రత్న పురస్కారం అందుకున్నాను. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైన గద్దర్‌ అవార్డు కూడా అందుకోవడం నేను పడిన శ్రమకు తగిన ఫలితంగా రావడం ఎంతో ఆనందంగా భావిస్తున్నాను. అయితే ఎవరు ఎన్ని సత్కారాలు చేసిన నా కుటుంబ సభ్యులైన ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌వారు నన్ను సత్కరించడం. నన్ను అభినందించడం సొంత ఇంటి వ్యక్తులు నావాళ్ళ సమక్షంలో జరిగిన ఈ సన్మానం నాకు చిరస్థాయిగా నిలిచిపోతుంది. నాకు ఇంత గొప్ప అవకాశాన్ని అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇక నుంచి మన అసోసియేషన్‌లో ఏ కార్యక్రమం అయినా హౌస్‌ఫుల్‌గా జరుగుతుంది. దానికి కారణం చదలవాడ శ్రీనివాస్‌గారు. గతంలో నేను జనరల్‌ సెక్రట్రీగా ఉన్నప్పుడు ఎన్నో ఎన్నో ఎంతో గొప్ప గొప్ప కార్యక్రమాలను చేపట్టాము. అప్పట్లో రవీంద్రభారతిలో చేసినటువంటి సిల్వర్‌జూబ్లీ కార్యక్రమానికి మొత్తం ఫిలిం ఇండస్ట్రీ కదలి వచ్చింది. మేము కమిటీలో ఉన్నప్పుడే అక్రిడేషన్‌ కార్డుల కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తునటువంటి గద్దర్‌ అవార్డు కావొచ్చు. గతంలో ఇచ్చిన నంది అవార్డులు కావొచ్చు ది బెస్ట్‌ బుక్‌ ఆప్‌ ఫిలిం అవార్డును, బెస్ట్‌ ఫిలిం జర్నలిస్ట్‌ అవార్డును ప్రభుత్వాన్ని అడిగి ఓకే చేయించుకున్నది నేను, గుడిపూడిశ్రీహరిగారు. అప్పటి నుంచి ఆ అవార్డులు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇందులో కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే… రెగ్యులర్‌ ఫిలిం జర్నలిస్టులు మాత్రమే ఈ అవార్డులకు అప్లై చేసుకోవాలి. కానీ… ఈ అవార్డులు రెగ్యులర్‌ జర్నలిస్టులకు కాకుండా ఎక్కడెక్కడో ఉన్న ఫీల్డ్‌తోగాని, సినిమాలతోగాని సంబంధం లేనివారు ఎక్కడో కూర్చుని ఫ్రీలాన్స్‌ జర్నలిస్టులుగా చేసేవారికి ఈ అవార్డులు దక్కడం. వారు రాసిన పుస్తకాలకు, వ్యాసాలకు బెస్ట్‌ జర్నలిస్ట్‌ అవార్డులను ఇస్తుంటే, ఇంతకాలం పాటు ఫీల్డ్‌లో తిరుగుతూ సినిమారంగంలోని లోటుపాట్లను విశ్లేషిస్తూ ఆర్టికల్స్‌ రాస్తున్నటువంటి మనకు ఎందుకు రాకుండా మనల్ని కాదని ఎవరో అవార్డులు ఎగరేసుకుపోతున్నారనే బాధని కొంతమంది సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. అది వాస్తవం కూడానూ. అవార్డు గ్రహీత అనేవారు ఎక్కడ పని చేస్తున్నారు. ఏ ఆర్గనైజేషన్‌ నుంచి వచ్చారు. లేదంటే ఫిలిం క్రిటిక్స్‌ మెంబరా అనే విషయాలను పరిగణలోకి తీసుకుని నెక్స్ట్‌ గద్దర్‌ అవార్డులు గాని భవిష్యత్తులో మరేదైనా అవార్డులు ఇచ్చినా ఆ ప్రవేశం ఉండాలన్న డిమాండ్‌ ఒకటి ఉంది. ఆ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కేవలం ప్రొఫిషనల్‌ ఫిలిం జర్నలిస్ట్‌ మాత్రమే ఇలాంటి అవార్డులకు అర్హులు అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని అప్లై చేసుకునేలా మనం చాలా క్లారిటీగా ప్రాతినిత్యం వహించి ప్రభుత్వం వద్ద రిప్రజంట్ చేద్దాం. ప్రస్తుతం ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ బత్తులప్రసాద్‌, సెక్రటరీ సురేషకొండేటి మిగతా కార్యవర్గం మొత్తం ఎంతో ఉత్సాహంగా పని చేస్తున్నారు. గత కొన్నేళ్ళుగా ఉన్న ఈ అసోసియేషన్‌ ద్వారా మన ఉనికిని మనం చాటుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలను మనం చేపట్టాలి. మీట్‌ ద ప్రెస్‌, కల్చరల్‌ ప్రొగ్రామ్స్‌ లాంటివి ఎన్నో మనం చేయాలి థ్యాంక్యూ అందరికీ.

సీనియర్‌ జర్నలిస్ట్‌ మోహన్‌ గోటేటిమాట్లాడుతూ… ఎందరో మహా మహానుభావులు ఉన్న సంస్థ ఇది. దీన్ని మనందరం కూడా కలిసి ముందుకు తీసుకువెళ్ళాలి. కొత్త కమిటీ ఎన్నికయ్యాక వెంటనే చేపట్టిన కార్యక్రమం ఇది. దీనికి మన ఆత్మబంధువు అయిన చదలవాడ శ్రీనివాస్‌గారిని ఆహ్వానించడం చాలా గొప్ప పరిణామం ఇది అని చెప్పాలి. ముందుగా మన కమిటీ వారిని ఈ విషయంలో ఎంతగానో అభినందిస్తున్నాను. శ్రీనివాస్‌రావుగారు ఎప్పుడూ కూడా మనల్ని మిత్రులు, పుత్రులు అంటారు మనల్ని. అంటే ఆయన మనల్ని ఎంతగా ఆయన సొంతమనుషులుగా భావిస్తున్నారో మీరు ఈ ఒక్క మాటను బట్టి తెలుసుకోవచ్చు. ఆయన కేలం చిన్న సినిమాలు మాత్రమే కాదు పెద్ద సినిమాలు కూడా చేస్తారు. ఇందులో ఎన్నో లోటుపాట్లు కూడా ఉన్నాయి. కానీ చిన్న సినిమాను నిలబెట్టాలి అనే ఒక లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం కూడా అదే. చిన్న సినిమాలు నిలబడితేనే ఎంతోమంది ఇండస్ట్రీకి వస్తారు. పెద్ద సినిమాలు వస్తాయి వెళ్ళిపోతాయి. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ప్రెసిడెంట్‌ ప్రసాద్‌గారిని, సెక్రటరీ సురేష్‌గారిని వీరందరిని కోరుతూ చాలా థ్యాంక్స్‌ అన్నారు.

ప్రెసిడెంట్ జెవి బత్తులప్రసాద్‌ మాట్లాడుతూ… చిన్న నిర్మాతల పరిస్థితి మనగడకే ప్రమాదకరంగా మారింది. తిరిగి చిన్న సినిమా బ్రతికి బట్టకట్టాలంటే ఏం చేయాలి.. చిన్న నిర్మాతల పరిరక్షణ కమిటీ అని పెట్టి కొన్ని ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు మన చదలవాడ శ్రీనివాసరావుగారు. ఆయనకు 5వేల కోట్ల రూపాయలు పెట్టి ఒక సినిమా తీయగల సత్తా ఉంది. కానీ దానివల్ల కొంతమంది మాత్రమే పనిచేస్తారని చిత్ర పరిశ్రమలో ఉన్న కార్మికులందరికీ సదుపాయాలు సమకూరాలంటే చిన్నసినిమాలు బ్రతకాలి. కాబట్టి ఆయన ఒక న్యాయ పోరాటం చేస్తున్నారు. దాని గురించి జరిగే సమావేశం ఇది. నాకు ఈ అవకాశం కలిపించినందుకు థ్యాంక్యూ వెరీమచ్‌ అన్నారు.

సెక్రటరీ సురేష్‌కోండేటి మాట్లాడుతూ… ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన ప్రతిఒక్కరికీ ఆయన తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో ఎఫ్‌సిఎ తరపున మరిన్ని కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించడానికి మా అసోసియేషన్‌ తరపు సన్నాహాలు చేస్తున్నాము. అలాగే త్వరలోనే మన అసోసియేషన్‌ డైమండ్ జూబ్లీ వేడుకలు కూడా నిర్వహించనున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు అని అన్నారు.



Related posts