‘వరుడు కావలెను‘ నుంచి నాగ శౌర్య-రీతువర్మల ప్రేమగీతం విడుదల

melodious love song from 'Varudu Kaavalenu' starring Naga Shaurya and Ritu Varma has released.
melodious love song from 'Varudu Kaavalenu' starring Naga Shaurya and Ritu Varma has released.
Spread the love
  • సిరివెన్నెలసీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన మధురమైన సాహిత్యం
  • -గాయని చిన్మయి ఆలపించిన సుమధురమైన గీతం – సంగీత, సాహిత్యాల కలబోత ఈ వీడియో చిత్రం

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘. నేడు (22-9-2021) ‘వరుడు కావలెను‘ యూనిట్ చిత్రంలోని ఓ గీతాన్ని విడుదల చేశారు. ఈ వీడియో చిత్రాన్ని వీక్షిస్తే సంగీత, సాహిత్యాల కలబోత అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే….
‘‘మనసులోనేనిలిచి పోకె మైమరపుల మధురిమ
పెదవిదాటి వెలికిరాక బెదురెందుకె హృదయమా
ఎన్నినాళ్ళిలా ఈ దోబూచుల సంశయం
అన్నివైపుల వెనుతరిమే ఈ సంబరం” అంటూ సాగే ఈ మధురమైన సాహిత్యం ప్రఖ్యాత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారింది.”గాయని చిన్మయి వీనుల విందుగా ఆలపించిన ఈ గీతానికి విశాల్ చంద్రశేఖర్ స్వరాలు ప్రాణం పోశాయి. చిత్ర నాయకా నాయికలు మధ్య ప్రేమకు తెర రూపంగా ఈ గీతం కనిపిస్తుంది. సంగీతం, సాహిత్యం, స్వరం ఈ పాటలో పోటీ పడ్డాయనిపిస్తుంది. వీటికి తోడు ‘నాగశౌర్య, రీతువర్మ‘ లు అభినయం కట్టిపడేస్తుంది. శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. నాయిక మనోభావాలకు అద్దంపడుతుందీ గీతం. ప్రఖ్యాత రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సాహిత్యం అందించిన ఈ గీతానికి స్వరాలు సమకూర్చటం గౌరవంగా భావిస్తున్నాను. ఇది నా మనసును ఎంతగానో హత్తుకున్న పాట. చిన్మయి గారు ఆలపించిన ఈ గీతం మీకు కూడా నచ్చుతుంది. ప్రేక్షకులకు,సంగీత ప్రియులకు చాలాకాలంపాటు గుర్తుండిపోయే పాటగా వారి హదయాలలో నిలిచి పోతుందని ఆశిస్తున్నాను అన్నారు చిత్ర సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్. ప్రస్తుతం చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘వరుడు కావలెను‘ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు,నటీ నటుల అభినయాలు చిత్ర కథా నుగుణంగా సాగి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.
నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు. ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్ సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్య దేవర నాగవంశి, కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య