ఎనిమిదేళ్ల సేవాశిఖరం ‘మనం సైతం’ కాదంబరి కిరణ్

enimidhella seva shikharam kadhambari kiran
enimidhella seva shikharam kadhambari kiran
Spread the love
  • అద్వితీయ సేవా ప్రస్థానం అయన సొంతం
  • కాదంబరికి తెలిసిందల్లా సాయం కోరిన పేదలను, ఆపన్నులను ఆదుకోవడమే..

‘మనం సైతం’ సేవా సంస్థ దిగ్విజయంగా తన సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. సరిగ్గా ఇవాళ్టికి ‘మనం సైతం’ స్థాపించి ఎనిమిదేళ్లవుతోంది. తన పుట్టినరోజునే ‘మనం సైతం’ సేవా సంస్థ దినోత్సవంగా మార్చుకున్నారు కాదంబరి కిరణ్. నా అన్నది మరిచి మనం అనే భావంతో సేవా యజ్ఞం నిర్వహిస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్టుల కార్మికులతో పాటు సాయం కోరిన పేదలను, ఆపన్నులను ఆదుకుంటున్నారు. ఈ ఎనిమిదేళ్లలో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు, పేదల కన్నీళ్లు తుడిచిన మరెన్నో సందర్భాలు ఉన్నాయి. ఆంధ్రలో తుఫాను బాధితులను ఆదుకోవడం, కేరళ ప్రకృతి విలయంలోని బాధితులకు అండగా నిలబడటం, కరోనా కష్టకాలంలో మందులు, ఆహార సరఫరా, ఆక్సీజన్ సిలిండర్లు, పీపీఈ కిట్స్…ఇలా మనం సైతం సేవా సంస్థ ద్వారా సాటి మనిషి ప్రతి బాధనూ పంచుకున్నారు కాదంబరి కిరణ్. మనం సైతం ద్వారా ప్రతి వారం బాధితుల ఫైల్స్ క్లియర్ చేస్తుంటారు. కాదంబరి సేవా గుణాన్ని మెచ్చిన సినీ తారలు సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, లోకనాయకుడు కమల్ హాసన్, ప్రజా నాయకులు కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఇలా ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందించి, ప్రోత్సహించారు. తన జీవితమంతా పేదల సేవకే అంకితం అని గర్వంగా చెప్పుకునే కాదంబరి కిరణ్…అనాధలకు, వృద్ధులకు “సపర్య” అనే వృద్ధాశ్రమం కట్టించాలనేది తన లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆయన కల నెరవేరితే నిరాదరణకు గురైన ఎంతోమందికి నీడ దొరుకుతుంది. ఎవరి జీవితం వారికే ఒత్తిడి, భారమైన ఈ రోజుల్లో సాటి వారి పట్ల ఇంత సేవా గుణాన్ని, వారిని ఆదుకునేందుకు ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఆర్థికంగా, నైతికంగా, మానసికంగా ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తూ భరోసా ఇస్తున్న మనం సైతం సేవా సంస్థకు, ఆ సంస్థ పేరుకు మారుపేరైన కాదంబరి కిరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.